Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. విజయవాడలోని పటమటలంకలో పవన్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. దాదాపు అరగంటపైగా సాగిన ఈ భేటీలో ఇరువురు నేతలు ఏ అంశాలపై చర్చించారన్నది వెల్లడి కాలేదు. అయితే, వీరిరువురి సమావేశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సమైక్య రాష్ట్ర విభజన వరకు శాసనసభ స్పీకర్గా బాధ్యతలు నిర్వహించిన నాదెండ్ల మనోహర్ ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా ఆయన రాజకీయ భవిష్యత్పై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. 2019 శాసనసభ ఎన్నికలలోగా ఆయన ఏదో ఒక రాజకీయపార్టీలో తిరిగి క్రీయాశీల పాత్ర పోషిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్కళ్యాణ్ను ఆయన కలవడంతో జనసేనలో ఆయన చేరనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, జనసేన వర్గాలు దీనిపై పెదవి విప్పడం లేదు. పవన్కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఎటువంటి వివరాలను వెల్లడించలేదు.