Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరెస్సెస్కు వ్యతిరేకంగా ఆగ్రాలో ముస్లింల నిరసన ర్యాలీ
లక్నో: ఉత్తర ప్రదేశ్లో తాజ్మహల్ సమీపంలో ఉన్న వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమిని ఆరెస్సెస్ ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆగ్రాలో ముస్లింలు శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. యూపీ ప్రభుత్వం, స్థానిక అధికార యంత్రాంగం జోక్యం చేసుకోవడంతో ఈ వ్యవహారం కొంతమేర సద్దుమణిగింది. అయినప్పటికీ ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల ముస్లిం కమ్యూనిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ భూమిని వెంటనే ముస్లింలకు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ స్థలాన్ని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఆరెస్సెస్ వివాదానికి తేరలేపిందని కాంగ్రెస్ ఆగ్రా అధ్యక్షులు, ముస్లిం నేత జమీలుద్దీన్ అన్నారు.
ప్రతి ఏడాది ఈ స్థలంలో బాబా నయీం షా ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారని, స్థలం కూడా 2151 నెంబర్తో వక్ఫ్బోర్డు పేరుమీద నమోదై ఉందని తెలిపారు. ఆ స్థలంలో ఏర్పాటు చేసిన పోలీసు బలగాలను వెనక్కురప్పించాలని, దాన్ని ముస్లింకు అప్పగించాలని డిమండ్ చేస్తూ నగర మేజిస్ట్రేట్ ద్వారా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్కు మెమోరండం పంపించినట్టుగా కాంగ్రెస్నేత వివరించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో ఆరెస్సెస్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ మత సామరస్యాన్ని కాపాడుకోవడానికి అనుమతించామని, కానీ ప్రస్తుతం దాన్ని ఆక్రమించుకునేందుకు అది తమదేనని ఆరెస్సెస్ ఆరోపిస్తోందని ముస్లింలు తెలిపారు. ఈ నిరసన ర్యాలీలో హజీ మంజూర్, హజీ ఖాదీర్, హజీ ముఖీం, హుమాయున్ ఖురేషీ, జమీల్ ఖాన్, అఖిల్ అబ్బాస్, అద్నాన్ ఖురేషీ, నదీం నూర్, మహమ్మద్ నూర్, న్యాయవాది మహమ్మద్ ఆరీఫ్, మహమ్మద్ యాసీన్, ఇతర ముస్లిం కమ్యూనిటీ నాయకులు పాల్గొన్నారు.