Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని ఓ బ్యాంకు మేనేజరు.. పంట రుణం మంజూరు చేయడానికి రైతు భార్యను లైంగిక వేధింపులకు గురి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంట రుణం కోసం దరఖాస్తు చేసిన మలక్పూర్ తహసీల్లోని దతల వద్ద బ్యాంకుకు బాధితురాలు తన భర్తతో కలిసి వచ్చింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ అయిన రాజేశ్ హివాసే.. పంట రుణం ప్రక్రియలో భాగంగా మహిళ ఫోన్ నెంబర్, వివరాలు తీసుకున్నాడు. అనంతరం ఆమెకు ఫోన్లు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడాడు. దరఖాస్తు చేసుకున్న పంట రుణం మంజూరు కావాలంటే తన లైంగిక వాంఛను తీర్చాలంటూ బాధితురాలిని ఆ కామాంధుడు కోరాడు. ఇందుకు ఒప్పుకోవాలంటూ ప్యూన్ను మహిళ ఇంటికి పంపాడు. హివాసే లైంగికవాంఛను తీరిస్తే మీకు కావాల్సిన పంట రుణం మంజూరు చేయడంతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కింద అందే ప్రయోజనాలను ఆయన కల్పిస్తారని ఆమెకు ప్యూన్ చెప్పాడు. ఈ సంభాషణను మొత్తం రికార్డు చేసిన ఆ మహిళ.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం బ్యాంకు మేనేజరు, ప్యూన్పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.