Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేరళ పట్ల మోడీ సర్కారు నిర్లక్ష్య ధోరణి అలాగే కొనసాగుతున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. కేంద్రం తగినంత సాయం అందించకపోవడంతో రాష్ట్రాభివృద్ధి కుంటుబడుతున్నదని ఆయన తెలిపారు. సమాఖ్య వ్యవస్థను మోడీ లెక్క చేయడం లేదని ఆరోపించారు. ప్రధానిని కలిసేందుకు సీఎం విజయన్.. పీఎంఓ కార్యాలయాన్ని ఇటీవల రెండుసార్లు కోరినా నిరాశే ఎదురైన సంగతి తెలిసిందే. కాగా.. ఢిల్లీలో విజయన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేరళపై కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందనడానికి పీఎంఓ కార్యాలయం స్పందిస్తున్న తీరే నిదర్శనమన్నారు. తాము మోడీని కలిసి సమస్యలను విన్నవించాలనుకుంటున్నాం. కానీ, పీఎంఓ ఆ అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. సమాఖ్య వ్యవస్థలో సంతృప్తికర రాష్ట్రం, బలమైన కేంద్రం ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతంతో పోల్చుకుంటే కేరళ పట్ల ఇంతకుముందు ప్రభుత్వాలు స్పందించిన తీరు బాగుందని అన్నారు. ఫెడరల్ సిస్టం, రాష్ట్రాల అవసరాల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. దురదృష్టవశాత్తు.. మోడీ సర్కారు దీన్ని అర్థం చేసుకోవడం లేదన్నారు. ఇంతకుమందు ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకున్నాయని తెలిపారు. అలాగని గత ప్రభుత్వాలు.. రాష్ట్రాల సంక్షేమం కోసం కావాల్సిన చర్యలన్నీ చేపట్టాయని తాను చెప్పడం లేదన్నారు. ఇప్పటితో పోల్చుకుంటే అప్పుడు మెరుగని చెప్పారు. కాగా.. మోడీతో అపాయింట్మెంట్ ఇవ్వడానికి పీఎంఓ నిరాకరించడం ఇది నాల్గోసారి అని సీఎం కార్యాలయం వెల్లడించింది. విజయన్.. ఇటీవల రెండుసార్లు మోడీ అపాయింట్మెంట్ కోరగా తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. అయితే.. 2016, 2017లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైనట్టు సీఎం కార్యాలయంలో పని చేస్తున్న ఉన్నతాధికారి ఈ సందర్భంగా గుర్తు చేశారు.