Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాస మానవ హక్కుల మండలికి ఏఐడీఎంఏఎం నివేదిక
- అంతర్జాతీయ స్థాయిసంస్థకు తొలిసారి వివరాలు అందజేత
న్యూఢిల్లీ : దేశంలో దళిత మహిళలపై దారుణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కాగా.. ఈ నేరాలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి ఆలిండియా దళిత మహిళా అధికార్ మంచ్(ఏఐడీఎంఏఎం) ఓ నివేదికను సమర్పించింది. దేశంలో జరిగిన పలు అకృత్యాలను ఈ నివేదికలో పొందుపరిచింది. ఓ దళిత మహిళా సంఘం.. అంతర్జాతీయ స్థాయి ఫోరంనకు రిపోర్టు సమర్పించడం ఇదే తొలిసారి. ఐరాస మానవ హక్కుల మండలి 38వ సమావేశాలు జెనీవాలో ఈనెల 18న ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఏఐడీఎంఏఎం జనరల్ సెక్రెటరీ ఆశా కొత్వాల్ ఈ నివేదికను సమర్పించారు. అంతేకాక ఓ లఘు డాక్యుమెంటరీని సైతం ప్రదర్శించారు. 'గతేడాది హర్యానాలో ఓ దళిత బాలిక(17)పై కొందరు సామూహిక లైంగికదాడికి పాల్పడి, దారుణంగా హత్య చేశారు. ఆమె కుటుంబానికి నేటికీ ఎలాంటి పరిహారమూ అందలేదు. అంతేకాక.. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చినా.. ఇంతవరకూ అతడిని అరెస్టు చేయలేదు' అని డాక్యుమెంటరీలో ఉన్నది. దళిత మహిళలపై పెరుగుతున్న నేరాలకు సాక్ష్యాధారాలుగా చూపించిన మూడు డాక్యుమెంటరీల్లో ఇదొకటి. 'జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. 33.2 శాతం మంది దళిత మహిళలు శారీరక వేధింపులను ఎదుర్కొంటున్నారు. అదే ఇతర కేటగిరీ మహిళల్లో 19.7 శాతం మందిపై వేధింపులు జరుగుతున్నాయి. అంతేకాదు.. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) ప్రకారం.. 2007 నుంచి 2017 వరకు దళితులపై నేరాలు 66 శాతం మేర పెరిగాయి' అని రిపోర్టు పేర్కొన్నది. అంతేకాక.. నేరాలపై గణాంకాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవద్దని తెలిపింది. ఎందుకంటే చాలా నేరాల్లో పోలీసుల సహకారం లేకపోవడం, ఇతర కారణాలతో కేసులు నమోదు కావడం లేదని తేలింది. కాగా.. కుల ఆధారితంగా జరుగుతున్న నేరాలను మానవ హక్కుల సంక్షోభంగా ఐరాస పరిగణిస్తుందా? అని ఆశా కొత్వాల్ ప్రశ్నించారు. కుల ఆధారిత వివక్ష ప్రపంచ సమస్య అని ఆమె తెలిపారు. కానీ, భారత్లో దళిత జనాభా ఎక్కువ ఉన్నందున ఈ నేరాలపై ఎక్కువ చొరవ చూపాలని కొత్వాల్ అన్నారు. ఐరాస మానవ హక్కుల మండలి సమావేశాలు జులై 6న ముగియనున్నాయి.