Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా దళితుడి పెండ్లి ఊరేగింపు
- 80 ఏండ్ల తర్వాత తొలిసారి
లక్నో: పెండ్లి వేడుక తర్వాత బారాత్ నిర్వహించుకోవడం సర్వసాధారణం. కానీ.. దళితులకు ఇది ప్రాణసంకటమే. దీని కోసం ఓ దళితుడు దాదాపు ఆర్నెల్లు పోరాడాడు. చివరకు విజయం సాధించాడు. దీంతో తన పెండ్లి ఊరేగింపును ఘనంగా నిర్వహించుకున్నాడు. యూపీలోని కాస్గంజ్ జిల్లాలో దళితుడు సంజరు జాదవ్ పోరాట విజయమిది. దళితుడు సంజరు జాదవ్ స్వగ్రామం బసారు నుంచి పెళ్లి కుమార్తె శీతల్ కుమారి గ్రామమైన నిజామ్పూర్కు పెత్తందార్ల ఇండ్ల ముందు నుంచి ఘనంగా పెండ్లి ఊరేగింపు నిర్వహిస్తూ వెళ్లాడు. నిజామ్పూర్ గ్రామంలో దాదాపు 80 ఏండ్ల తర్వాత ఓ దళితుడు బారాత్ నిర్వహించడం ఇదే తొలిసారి. భారీ భద్రత నడుమ ఈ వేడుక జరగడం విశేషం. ఈ బారాత్కు దాదాపు 10 మంది పోలీసు ఇన్స్పెక్టర్లు, 22 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 35 మంది హెడ్ కానిస్టేబుల్స్, 100 మంది కానిస్టేబుల్స్ భద్రత కల్పించారు. అతను వెళ్లాల్సిన మార్గంలో పెత్తందార్ల ఇండ్లు ఉండడంతో తమ ఇండ్ల ముందు నుంచి బారాత్ తీయడానికి వీల్లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అతను జిల్లా యంత్రాంగాన్ని ఆశ్రయించాడు.
అయితే శాంతిభద్రతల సమస్యను సాకుగా చెప్పి బారాత్కు వారు నిరాకరించడంతో సంజరు జాదవ్ కోర్టును ఆశ్రయించాడు. పోలీసుల భద్రత నడుమ బారాత్ నిర్వహించుకోవడానికి కోర్టు అనుమతినవ్వడంతో ఆదివారం ఈ వేడుక ఘనంగా జరిగింది. దళిత ఉద్యమానికి చిహ్నమైన మెరిసే నీలం రంగు దుస్తులతో పెండ్లి కుమారుడు ఈ వేడుకలో పాల్గొనడం విశేషం. 'మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. కానీ కొందరు మాత్రం ఇంకా దళితులకు గౌరవం ఇవ్వకూడదని భావిస్తున్నారు. ఈ గ్రామంలో బారాత్ నిర్వహించిన తొలి దళితుడిని నేనే. ఇది బాబాసాహెబ్, ఆయన రాజ్యాంగం వల్లే సాధ్యమైంది' అని సంజరు అన్నారు. 'కొంతమంది సమస్యలు సృష్టిచేందుకు ప్రయత్నించారు. ఈ వేడుకకు మేం భారీ భద్రతను ఏర్పాటుచేశాం. దాంతో వారు వెనక్కి తగ్గారు' అని కస్గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ ఆర్పి సింగ్ చెప్పారు.