Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగున్నరేండ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
- జూన్లో 5.8 శాతానికి..
న్యూఢిల్లీ: దేశంలో అంతకంతకు పెరుగుతున్న ధరల మంటకు అద్దం పడుతూ గత జూన్ నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగున్నరేండ్ల గరిష్టానికి ఎగిసింది. ఆహార ఉత్పత్తులు, చమురు ధరలు పెరగడంతో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) గత నెలలో 5.77 శాతంగా నమోదైందన వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. అంతకు ముందు మే నెలలో డబ్ల్యూపీఐ 4.43 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే జూన్ మాసంలో డబ్ల్యూపీఐ కేవలం 0.90 శాతంగా నమోదు కావడం విశేషం. గత వారం విడుదలైన జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం (సీబీఐ) కూడా 5 శాతానికి ఎగిసిన సంగతి తెలిసిందే. ఇది నాలుగు నెలల గరిష్టం కావడం గమనార్హం. మొత్తం టోకు ధరల సూచీల్లో అత్యధిక ప్రాధాన్యత కలిగిన ప్రాథమిక వస్తువుల ధరలు జూన్ మాసంలో 5.3 శాతం మేర పెరిగాయి. అంతకు ముందు మే నెలలో ఇది 3.16 శాతంగా ఉంది. జూన్ మాసంలో కూరగాయల ధరలు 8.12 శాతానికి పెరుగగా.. అందులో బంగాళదుంప ధరలు జూన్లో 99.02 శాతానికి ఎగిశాయి. పప్పు ధాన్యాలు ధరలు మాత్రం రివర్స్ ట్రెండ్లో తగ్గుతూ రావడం విశేషం. మే నెలలో -21.13 శాతంగా ఉన్న పప్పుధాన్యాల ధరలు, జూన్ నెలలో -20.23 శాతంగా నమోదయ్యాయి. ఇంధనం, విద్యుత్తు ద్రవ్యోల్బణం ఈ డబ్ల్యూపీఐలో 13.15 శాతం వెయిటేజ్ను కలిగి ఉన్నాయి. అయితే ఈ ద్రవ్యోల్బణం మాత్రం మే నెలలో 11.22 శాతంగా ఉంటే, జూన్ నెలలో ఏకంగా 16.18 శాతానికి పెరిగింది. ఇంధన ధరలు 13.90 శాతం నుంచి 17.45 శాతానికి, డీజిల్ ధరలు 17.34 శాతం నుంచి 21.63 శాతానికి ఎగిశాయి.