Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రేపటి నుంచి పార్లమెంట్ ప్రారంభం
- 18 సిట్టింగులు.... జాబితాలో 43 బిల్లులు
- అస్త్రశస్త్రాలతో విపక్షాలు సిద్ధం..
- కాశ్మీర్ కల్లోలం, దళితులపై దాడులు, రైతు సమస్యలే ఆయుధాలు
- కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ తర్జనభర్జన
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
పార్లమెంట్ వేదికగా అధికార, విపక్షాలు మరో పోరుకు సన్నద్ధమవుతున్నాయి. మోడీ సర్కారు నాలుగేండ్ల వైఫల్యాలే ఆయుధాలుగా మలుచుకుని కేంద్రాన్ని దోషిగా నిలపాలని విపక్షాలు భావిస్తుం డగా.. ట్రిపుల్ తలాక్లాంటి కీలక బిల్లులను ఆమోదించి కౌంటర్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు... వాడివేడిగా సాగనున్నాయి. పైగా 2019 లోక్సభ ఎన్నికలకు ముందు 'చివరి పూర్తిస్థాయి' సమావేశాలు కావ డంతో.. వర్షాకాల సమావేశాలను అధికార, విపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. మరోవైపు మోడీ సర్కారుకు వ్యతిరేకంగా 13విపక్ష పార్టీలు ఏకమ య్యాయి. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించా ల్సిన వ్యూహాలపై చర్చించాయి. కాగా రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, దళితులపై దాడులు, కాశ్మీర్ అశాంతిపై కేంద్రాన్ని నిలదీయాలని సీపీఐ(ఎం) నిర్ణయించింది.
వర్షాకాల పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు బుధవారం ప్రారంభంకానుండగా... ఆగస్టు 10వ తేదీతో ముగియనున్నాయి. మొత్తం 18 సిట్టింగుల ఈ సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం 43 బిల్లులను అజెండా జాబితాలో చేర్చింది. ఇందులో 25 బిల్లులు ఇప్పటికే ఉభయసభల ముందు పెండింగ్లో ఉండగా... మరో 18బిల్లులు కొత్తగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో జీఎస్టీ బిల్లుల సవరణతో పాటు ఆర్టీఐ సవరణ బిల్లు, క్రిమినల్ లా సవరణ బిల్లు, హ్యుమన్ ట్రాఫికింగ్ బిల్లు, వాణిజ్య కోర్టులు(సవరణ) బిల్లు, మానవహక్కుల పరిరక్షణ(సవరణ), ప్రాజెక్టుల భద్రత బిల్లులు ఉన్నా యి. కాగా ఇప్పటికే ముస్లిం మహిళా (వివాహాహ క్కుల పరిరక్షణ) ట్రిపుల్ తలాక్ బిల్లు, ట్రాన్స్జెండర్ హక్కుల బిల్లు, బీసీ కమిషన్కు రాజ్యాంగబద్దత కల్పించే రాజ్యాంగ సవరణ(123వ) బిల్లు, మోటారు వాహనాల తదితర బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
అస్త్రశస్త్రాలతో విపక్షాలు రెఢి
మోడీ సర్కారుపై పోరుకు విపక్షాలు ఏకమ య్యాయి. సోమవారం 13 పార్టీల నేతలు రాజ్యసభా విపక్ష నేత గులాంనబీ ఆజాద్ నేతృత్వంలో పార్లమెం ట్లోని లైబ్రరీ హాల్లో భేటీ అయ్యారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల పై చర్చించారు. ఈ సమావేశానికి గులాంనబీ ఆజాద్తో పాటు కాంగ్రెస్ నుంచి అహ్మద్పటేల్, మల్లి ఖార్జునఖర్గే, ఆనంద్శర్మ, జ్యోతిరాధిత్య సింథియా, శరద్పవర్(ఎన్సీపీ), మహ్మద్సలీం(సీపీఐ(ఎం)), రాంగోపాల్ యాదవ్(ఎస్పీ), మిసాభారతి(ఆర్జేడీ), రాజా(సీపీఐ), కుపేంద్రరెడ్డి(జేడీ-ఎస్), జోస్కే మణి(కేసీ-ఎం), కునాలికుట్టి(ఐయూఎంఎల్), ఎలన్గోవన్(డీఎంకే), శేఖర్రారు(తృణమూల్) తదితరులు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలని విపక్షాలుగా తాము కోరుకుంటున్నట్టు ఆజాద్ తెలిపారు. చివరిసారి సమావేశాల్లోనూ ఉభయసభలు సాగాలని కోరుకున్నామని గుర్తు చేశారు. కానీ అధికారపక్షం తమపై ఆరోపణలు గుప్పించిందని విమర్శించారు.
బిల్లుల ఆమోదానికి సహకరించండి..
నేడు స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్షం
రేపటి నుంచి ప్రారంభంకానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మంగళవారం(నేడు) వివిధ రాజకీయ పార్టీల నేతలతో భేటీ అవుతు న్నారు. ముఖ్యంగా కీలక బిల్లుల ఆమోదానికి సహకరించడంతో పాటు సభా కార్యక్రమాలకు విఘాతం కలిగించొద్దని ఈ సమావేశంలో విపక్ష ఎంపీలను కోరే అవకాశమున్నది. పార్లమెంట్లోని లైబ్రరీ హాల్లో ఈ భేటీ జరగనుంది. భేటీ అనంతరం ఎంపీలకు స్పీకర్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా హాజరుకానున్నారు. అయితే స్పీకర్ అధ్యక్షతన జరిగే భేటీకి ప్రధానమంత్రి హాజరుకాబోరని, విందులో పాల్గొంటారని లోక్సభా కార్యాలయ వర్గాలు తెలిపాయి.
మహిళా బిల్లును ఆమోదించండి: రాహుల్ లేఖ
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్గాంధీ సోమవారం లేఖ రాశారు. 'బీజేపీ, దాని మిత్రపక్షాలకు లోక్సభలో మెజార్టీ ఉన్నది. ఈ చారిత్రాత్మక బిల్లు వాస్తవరూపం దాల్చేందుకు మీ మద్దతు కావాలి. బిల్లు ఆమోదానికి అవరోధం కలగబోదని ఆశిస్తున్నాను' అని లేఖలో పేర్కొన్నారు. ఈ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమా వేశాల్లో ఆమోదిస్తే వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో మరింత అర్ధవంతమైన సంఖ్యలో మహిళలు పోటీచేసే అవకాశముందని పేర్కొన్నారు. బిల్లుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 32 లక్షల మంది సంతకాలు సేకరించినట్టు తెలిపారు. మహిళా సాధికారత అంశంలో రాజకీయాల కతీతంగా ఉమ్మడిగా నిలుద్దామని సూచించారు.