Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలుచోట్ల పాలు పారబోసి నిరసన
- మహారాష్ట్రలో గిట్టుబాటుధర కోసం రోడ్డెక్కి ఆందోళన
ముంబయి: పాడి పరిశ్రమను ఆదుకోవడంలో మహారాష్ట్ర సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర రైతులు పాల సరఫరాను నిలిపివేసి ఆందోళనకు దిగారు. దీంతో సోమవారం ఉదయం నుంచి ముంబయి, పూణె నాగపూర్, నాసిక్ సహా ఇతర ప్రధాన పట్టణాలకు పాల సరఫరా నిలిచిపోయింది. మహారాష్ట్ర కిసాన్ సభ (ఎంకేఎస్), స్వాభిమాని షేత్కారి సంఘటన (ఎస్ఎస్ఎస్) నేతృత్వంలో రైతుల ఈ ఆందోళనను ప్రారంభించారు. పాలకు రూ. 5ను ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలనీ, వెన్నతోపాటు, ఇతర పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమస్యలపై రైతులు ఆర్నెల్ల క్రితం ముంబయి నగరంలో భారీ నిరసనకు దిగారు. కాగా, సబ్సిడీకి మహారాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగా, ఇచ్చిన హామీని ఇంతవరకూ నెరవేర్చలేదనీ ఆరోపిస్తూ తాజాగా రైతులు ఈ ఆందోళనకు దిగారు. పాల ఉత్పత్తి వ్యయం లీటరుకు రూ. 35 ఉండగా, కనీసం దానిలో సగం ధర కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.. ప్రతీరోజూ రాష్ట్రంలో 3 కోట్ల లీటర్ల పాలు సేకరిస్తుండగా ఒక్క ముంబై నగరానికే 70 లక్షల లీటర్ల పాలు అవసరం. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు సోమవారం రైతుల ఆందోళన అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కాగా దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. ఆందోళన చేస్తున్నది రైతులు కాదనీ, వారికి మాయమాటలు చెప్పి ఫెడరేషన్లు వారిచే ఈ ఆందోళన చేయిస్తున్నాయని విమర్శించింది. పాల సరఫరా నిలిపివేసి చేస్తున్న ఈ సమ్మెతో రైతులకు నష్టం తప్ప మరొకటి కాదని తెలిపింది. వాగ్వివాదం నడుమ ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.