Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదాయం రెట్టింపు అయ్యిందన్న రైతు మాట అబద్ధం
- క్షేత్రస్థాయికి వెళ్లి నిజనిర్ధారణ చేసిన జాతీయ మీడియా
- ప్రధానితో అలా చెప్పాలంటూ.. అధికారులు ఏర్పాట్లు
''మేము రెండు ఎకరాల్లో గోధుమ పండిస్తున్నాం. గతంతో పోల్చితే...ఇప్పుడు మా ఆదాయం రెట్టింపు అయ్యింది''అని ప్రధాని మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఓ మహిళా రైతు చెప్పటం జాతీయ వార్తలకు ఎక్కింది. ప్రధాని మోడీతో సహా అధికారంలో ఉన్న బీజేపీ నాయకులందరూ ఆ మహిళా రైతు మాటల విని సంబరపడిపోయారు. 'ఆ మాటల్లో నిజమెంత' అని క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేయగా...'రైతులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్' అంతా అధికారుల ముందస్తు ఏర్పాటు..అన్న సంగతి తేలిపోయింది.
న్యూఢిల్లీ: జూన్ 20న ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరితోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్కు చెందిన ఓ మహిళా రైతుతో ప్రధాని మాట్లాడారు. కాంకెర్ జిల్లాలోని కన్హేరిపూరి గ్రామానికి చెందిన ఆ మహిళా రైతు వ్యవసాయం చేస్తూ జీవిస్తోంది. వ్యవసాయంపై ఆదాయం ఎంత వస్తోందని ప్రధాని అడిగారు. గతంలో కన్నా ఇప్పుడు లాభాలు బాగా వచ్చాయని, ఆదాయం రెట్టింపు అయ్యిందని ఆమె చెప్పింది. ప్రధానితో మాట్లాడిన మహిళా రైతు గ్రామానికి వెళ్లి, ఆమె ఆదాయం రెట్టింపు ఎలా అయ్యిందో తెలుసుకునే ప్రయత్నం పలు జాతీయ వార్తా, మీడియా సంస్థలు చేశాయి. అసలు విషయం బయటపడటానికి ఎంతో సమయం పట్టలేదు. ఆమె రెండు ఎకరాల్లో గోధుమ పంట వేసిందని, ఆదాయం రెట్టింపు అయ్యిందన్న మాట అబద్ధమని తేలిపోయింది. ఆమె పొలం వద్దకు వెళ్లి పరిశీలించి మరీ మీడియా ప్రముఖులు ఓ నిర్ధారణకు వచ్చారు. మరి ఆమె అలా ఎందుకు చెప్పిందని గ్రామ సర్పంచి (కన్హేరుపురి, కాంకర్ జిల్లా) పరుషురామ్ బోయార్ను అడగ్గా, వీడియో కాన్ఫరెన్స్కు రెండు గంటల ముందు ఢిల్లీ నుంచి వచ్చిన ఓ అధికారిక బృందం ఆమెతో అలాంటి మాటలు చెప్పించిందని అన్నారు.
అసలు నిజమేంటో బయటపడేసరికి, ఛత్తీస్గఢ్లోని బీజేపీ ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోలేదు. సమర్థించుకునేందుకు పలు దారుల్ని వెదికింది. ఆ మహిళా రైతు చెప్పింది నిజమేనని, అయితే రెండు ఎకరాల్లో గోధుమ పండించటం ద్వారా ఆమె ఆదాయం రెట్టింపు కాలేదని, సీతాఫలాల పెంపకం ద్వారా ఆమె ఆదాయం రెట్టింపు అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రకటన చేసింది. ఇది కూడా నిజం కాదని తర్వాత తెలిసింది.
ఒక అబద్ధాన్ని నిజం చేయటం కోసం, మరో అబద్ధాన్ని రమణ్సింగ్ ప్రభుత్వం అల్లిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కన్హేరుపురి గ్రామంలో 12మంది మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడి సీతాఫలాల్ని సేకరించటం, వాటిని అమ్మటం ద్వారా వచ్చిన ఆదాయం రూ.700. ప్రతీ ఒక్కరికి రోజులో వచ్చింది రూ.58. అయితే రూ.700 ఆ మహిళ (ప్రధానితో మాట్లాడిన వ్యక్తి) ఒక్కతే ప్రతీరోజూ ఆదాయంగా పొందుతోందని ఒక వార్తా ఛానెల్ ప్రసారం చేయటంతో కన్హేరుపురి గ్రామంలో కలకలం రేగింది. ఆ వార్తా సంస్థ స్థానిక రిపోర్టు సైతం దీనిని విని ఆశ్చర్యపోయాడు.
క్షేత్రస్థాయి వెళ్లి వివరాలు సేకరించగా, ఆమె చెప్పింది అబద్ధమని తేలిపోయింది. నిజానికి ఉపాధి హామీ పనికి వెళ్లే..కార్మికుడు పొందేదానికన్నా తక్కువగా ఆ మహిళలు అందుకుంటున్నారు. కొండల్లో, గుంటల్లో, అడవిలో సేకరించిన సీతాఫలాల్ని తీసుకొస్తున్నామని, ఈ వ్యాపారం కోసం రూ.7500 పెట్టుబడిగా పెట్టామని ఆ 12మంది మహిళలు రిపోర్టరుకు తెలియజేశారు. పెట్టిన పెట్టుబడి సైతం తమకు తిరిగి రాలేదని వారు వాపోయారు.