Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రలో 11 నెలల్లో 13,500 మందికిపైగా మృతి
ముంబయి: మహారాష్ట్రలో శిశుమరణాల రేటు గణనీయంగా పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా పదకొండు నెలల కాలంలోనే 13,500 మందికి పైగా శిశువులు మరణించారు. తక్కువ బరువు, న్యూమోనియా, శ్వాస సంబంధిత సమస్యల వంటి వివిధ ఆరోగ్య సమస్యలతో ఈ మరణాలు సంభవించినట్టుగా ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ దీపక్ సావంత్ అసెంబ్లీలో సోమవారం వెల్లడించారు. 2017 ఏప్రిల్ నుంచి 2018 ఫిబ్రవరి మధ్య కాలంలో 13,541 మంది శిశువులు చనిపోయారని ఆయన తెలిపారు. వారిలో 3,778 మంది నవజాత శిశువులు పుట్టిన 24 గంటల్లోపే మరణించగా ఇదే కాల వ్యవధిలో రాజధాని ముంబయిలో 483 మంది చిన్నారులు మృతి చెందారని సావంత్ పేర్కొన్నారు. మొత్తం శిశుమరణాల్లో 22 శాతం మంది తక్కువ బరువు కారణంగా, ఏడు శాతం మంది న్యూమోనియా, అంటువ్యాధులతో, మరో 14 శాతం మంది శ్వాస సంబంధిత సమస్యతో మరణించారని చెప్పారు. 65 శాతం శిశువులు మొదటి 28 రోజుల్లో చనిపోగా, 21 శాతం మంది 28 రోజుల నుంచి ఏడాది వయసున్న చిన్నారులు, 14 శాతం మంది ఏడాది నుంచి ఐదేండ్ల శిశువులు ఈ ఆరోగ్య సమస్యలతో మరణించినట్టుగా సావంత్ వివరించారు.
అలాగే శిశుమరణాల రేటు తగ్గించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రస్తావించారు. శిశువులతోపాటు, తల్లుల సంరక్షణ, టీకాలకు సంబంధించి వాటిపై తీసుకుంటున్న చర్యలు, వివిధ పథకాల గురించి వివరించారు. కాగా ప్రతిపక్ష పార్టీ నాయకులు రాధాక్రిష్ణ విఖే-పాటిల్, పృధ్వీరాజ్ చావన్, యోగేశ్ సాగర్ తదితరులు ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తారు.