Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా ఆరునెలల్లో 100 ఘటనలు
- మొదటి మూడు స్థానాలు బీజేపీ పాలిత రాష్ట్రాలవే
- దళితులు, మైనార్టీలే లక్ష్యంగా దాడులు : ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అణగారిన వర్గాలే లక్ష్యంగా ద్వేషపూరిత నేరాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మానవ హక్కుల గ్రూపు 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్' విడుదల చేసిన నివేదిక దీనిని స్పష్టం చేస్తోంది. నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా అణగారిన వర్గాలే లక్ష్యంగా ద్వేషపూరిత నేరాలు చోటుచేసుకుంటున్న రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రం యూపీ ఈ ఏడాదీ మొదటి స్థానంలో ఉన్నది. ఈ విషయంలో గత రెండేండ్లలోనూ యూపీ అగ్రభాగంలో ఉన్నది. ఇందులో మొదటి మూడు స్థానాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉండటం గమనించాల్సిన అంశం. ఈ ఏడాది ఆరునెలల్లో దేశవ్యాప్తంగా అణగారిన వర్గాలే లక్ష్యంగా 100 ద్వేషపూరిత నేరాలు జరిగాయని నివేదిక వెల్లడించింది. రాష్ట్రాల పరంగా చూస్తే 18నేరాలతో యూపీ మొదటి స్థానంలో ఉన్నది. అదేవిధంగా, 13 కేసులతో ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ రెండో స్థానంలో, ఎనిమిది కేసులతో రాజస్థాన్ మూడో స్థానంలో ఉన్నది. ఏడు కేసులతో తమిళనాడు, బీహార్ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ద్వేషపూరిత నేరాలు దేశవ్యాప్తంగా ఎక్కువగా దళితులు, మైనార్టీలే లక్ష్యంగా జరుగుతున్నాయని నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా దళితులపై 67, ముస్లింలపై 22 ద్వేషపూరిత దాడులు జరిగాయాని పేర్కొన్నది. అలాగే 42 ఘటనల్లో హత్యలు, మరో 13 ఘటనలు.. అణగారిన వర్గాలకు చెందిన మహళలపై జరిగిన లైంగికదాడులుగా ఉన్నాయి. కాగా.. గోదాడులు, కులదురహంకార హత్యలు.. ద్వేషపూరిత నేరాలకు ప్రధాన కారణాలని తెలిపింది. యూపీలో ఎక్కువగా మతం, కులం విషయాల్లో ఈ తరహా నేరాలు అత్యధికంగా చోటుచేసుకుంటున్నాయని వివరించింది. పిల్లలను ఎత్తుకుపోయేవారన్న వదంతుల కారణంగా జరిగిన దాడుల్లో గత రెండునెలల్లో దేశవ్యాప్తంగా 20 మందికి పైగా మరణించారని నివేదిక తెలిపింది. ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నప్పటికీ వీటిపై నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) ప్రత్యేకంగా ఎలాంటి చొరవ చూపలేదు. ద్వేషపూరిత నేరాలు 'వివక్ష'తో కూడుకన్నవని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ ఆకార్ పటేల్ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇవి ఇతరనేరాలతో పోలిస్తే విభిన్నమని, వీటిని ఇతర నేరాల్లాగా చట్టం గుర్తించలేదన్నారు.