Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మన్నన్ వానీ బహిరంగ లేఖ
శ్రీనగర్: తానెందుకు ఉగ్రవాదిగా మారాల్సి వచ్చిందో వివరిస్తూ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) మాజీ పరిశోధక విద్యార్థి మన్నన్ వానీ బహిరంగ లేఖ రాశారు. మంగళవారం జమ్మూకాశ్మీర్కు చెందిన స్థానిక మీడియాకు లేఖ రాస్తూ.. 'జమ్మూకాశ్మీర్ ప్రజలను భారత్ తన మాటలతో తెలివిగా తికమకలకు గురి చేస్తోంది. వారి (భారత్) సైన్యాన్ని రాష్ట్రంలో మొహరించి దురాక్రమణలకు పాల్పడుతోంది. మా ఆత్మగౌరవం కోసం పోరాడితే మమ్మల్ని మతవాదులుగా, ఉగ్రవాదులుగా ముద్ర వేస్తోంది. మేం భారత సైన్యం లాగా కాశ్మీర్ పౌరులను చంపడం లేదు. మమ్మల్ని ఉగ్రవాదులుగా ముద్రవేసి ఈ ప్రాంతంపై నిరంకుశంగా వ్యవహరిస్తున్న వారిని సంహరిస్తున్నాం. మేం సైనికులం. చనిపోవడానికి పోరాడడం లేదు. మా ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తున్నాం. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం' అంటూ పేర్కొన్నారు. లేఖలో ముందుగా మాల్కమ్ ఎక్స్ వ్యాఖ్యలను ఉద్ఘాటిస్తూ.. 'శాంతియుతంగా ఉండు, మర్యాదపూర్వకంగా ఉండు, చట్టాలకు విధేయుడుగా ఉండు.. కానీ, ఎవరైనా నీమీద అన్యాయం చెలాయిస్తే మాత్రం వారిని శ్మశానానికి పంపు' అని రాశారు. ఏఎంయూలో జియాలజీ స్కాలర్గా ఉన్న మన్నన్.. ఈ ఏడాది జనవరిలో కనపడకుండా పోయారు. తరువాత కొన్ని రోజులకు ఒంటి మీద గ్రెనైడ్ లాంచర్తో ఉన్న అతడి ఫోటో సోషల్మీడియాలో ప్రత్యక్షమయ్యింది. అతడు వేర్పాటువాద ఉగ్రవాద సంస్థ హిజ్బూల్ ముజాహిద్ధీన్లో చేరాడని పోలీసులు ధ్రువీకరించారు.