Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీటిపై చట్టం తీసుకురావాలని కేంద్రానికి ఆదేశాలు
- దాడుల్ని నియంత్రణకు తీసుకున్న చర్యలేంటి? యూపీ, హర్యానా, రాజస్థాన్లకు ప్రశ్నించిన న్యాయస్థానం
న్యూఢిల్లీ : గో సంరక్షణ పేరుతో దేశవ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్న దాడులను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా ఖండించింది. ఇలా దాడి చేయడం సరైనది కాదని, చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాడులకు పాల్పడే వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని ఆదేశించింది. గత కొంతకాలంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆవుల సంరక్షణ పేరుతో దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆవులను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ కొందరు గో సంరక్షణ కార్యకర్తలు వ్యక్తులపై దాడులు చేస్తూ చంపేస్తున్నారు. దీంతో ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త తెహసీన్ పూనావాలా, మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. 'భయం, అరాచకత్వం వంటి ఘటనల్లో రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి. హింసను అనుమతించకూడదు. రక్షణ పేరుతో గుంపుగా దాడి చేయడం ఎంతమాత్రం సరికాదు. వీటిని అరికట్టడం రాష్ట్రాల బాధ్యత. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పార్లమెంట్ ఓ ప్రత్యేక చట్టాన్ని తయారుచేయాలి' అని ధర్మాసనం స్పష్టం చేసింది.
నాలుగువారాల్లో నివేదించండి..
దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఎలాంటి చట్టం చేస్తున్నారో నాలుగు వారాల్లో తమకు నివేదించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రజల హక్కులకు భంగం కలిగించే చర్యలను నివారించడానికి ప్రతి జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని గతంలోనే రాష్ట్రాలను ఆదేశించినట్టు న్యాయస్థానం గుర్తుచేసింది. రాజస్తాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు గోరక్షణ పేరుతో జరగుతున్న దాడులను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో తమకు తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. సమాజంలో హింసకు తావులేదన్న ప్రధాన న్యాయమూర్తి తదుపరి విచారణను ఆగస్ట్ 28కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.