Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోటీసు ఇచ్చిన టీడీపీ ఎంపీ
- నిర్మాణాత్మక చర్చలకు సహకరించండి : విపక్షాలకు ప్రధాని వినతి
- సభ సజావుగా జరపండి : టీఆర్ఎస్
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస అస్త్రం సంధించింది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల తొలిరోజే నోటీసును అనుమతించాలని కోరింది. గత బడ్జెట్ సమావేశాల్లోనూ టీడీపీతో పాటు కాంగ్రెస్, సీపీఐ(ఎం) పలు పార్టీలు అవిశ్వాస నోటీసులు అందజేశాయి. అయితే సభ ఆర్డర్లో లేదంటూ స్పీకర్ నోటీసులను అనుమతించలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ మరోసారి అవిశ్వాస నోటీసు అందజేసింది. కాగా ఈ సమాశాల్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేలా విపక్షాలు సహకరించాలని విపక్షాలకు ప్రధాని కోరారు. విపక్షాలు లేవనెత్తిన అంశాలను బట్టి తమ విధానాలను పున:పరిశీలన చేసుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న కొట్టిచంపుతున్న ఘటనలు, మత ఘర్షణలపై కేంద్రాన్ని నిలదీయాలని విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి ప్రారంభంకానున్న సమావేశాల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయో మరికొన్ని గంటల్లో తేలనున్నది.
బుధవారం నుంచి ప్రారంభమవుతున్న వర్షాకాల పార్ల మెంట్ సమావేశాల సందర్భంగా మంగళవారం పార్లమెంట్ లోని లైబ్రరీ హాల్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్కుమార్ అధ్యక్షతన అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభా పక్ష నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధా నమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి రాజ్నాథ్సింగ్ తదిత రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ... దేశప్రయోజనాల కోసం ఈ పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు నిర్మాణాత్మక సహకారం అందిం చాలని కోరారు. విపక్షాలు లేవనెత్తిన ప్రతి అంశానికీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. దేశా నికి సంబంధించిన కీలకమైన అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరిగేలా విపక్షాలు పూర్తి సహకారం అందజేస్తాయన్న ఆశా భావం వ్యక్తం చేశారు. కాగా పార్లమెంట్ ఉభయసభలు సజావుగా సాగేందుకు పూర్తి సహకారం అందజేస్తామని విపక్ష నేతలు తెలియజేశారని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ తెలిపారు. నిబంధనలకు అను గుణంగా సభలో ఏ అంశంపైన అయినా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆగస్టు 10వ తేదీతో ఈ సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశంలో టీఆర్ ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కే కేశవరావుతో పాటు లోక్ సభాపక్ష నేత జితేందర్రెడ్డి పాల్గొన్నారు.
అఖిలపక్షంలో కొంత గందరగోళం...
పార్లమెంట్ వ్యవహారాల శాఖ అనుసరించిన తీరుతో అఖిలపక్ష సమావేశంలో కొంత గందరగోళం జరిగింది. వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీకి ఫిరాయించిన బుట్టా రేణుక ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఆమె కూర్చున్న స్థానం ముందు వైసీపీ బోర్డు పెట్టడంపై ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'డబ్బులకు అమ్ముడుపోయి పార్టీ ఫిరాయించిన ఎంపీని వైసీపీ తరఫున ఎలా పిలుస్తారు? ఇది నీతి బాహ్యమైన చర్య. ఇందులో టీడీపీ,బీజేపీ కుట్ర ఉన్నది' అని మంత్రి అనంతకుమార్పై అసహనం వ్యక్తం చేశారు. 'బుట్టా రేణు కపై ఇంకా అనర్హత చర్యలు తీసుకోకపోవడంతో పిలిచామని అనంతకుమార్ చెప్పారు. ఏ ప్రతిపాదికపై ఆమె ముందు వైసీపీ బోర్డు పెట్టారని ప్రశ్నించాను. పార్టీ అధినేత నుంచి అంగీకార ధ్రువీకరణ పత్రం ఏమైనా సమర్పించారా అని అడిగాను. ఆమె ముందు పెట్టిన బోర్డును తొలగిస్తారా లేక సమావేశాన్ని బారుకాట్ చేయాలా అని మంత్రిని అడిగాం. అనంతకుమార్ చర్యను అన్ని విపక్షాలు తప్పుపట్టాయి. దీంతో ఆమె ముందు నుంచి వైసీపీ బోర్డును తొలగిం చేందుకు అంగీకరించారు' అని విజయసాయిరెడ్డి చెప్పారు.
టీడీపీ అవిశ్వాస అస్త్రం
కేంద్రప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస అస్త్రం సంధిం చింది. ఆ పార్టీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ మంగళవారం లోక్సభ సెక్రటరీ జనరల్కు అవిశ్వాస నోటీసు అందజేశారు. లోక్సభా నిబంధనల్లోని రూల్ 198(1)కింద అవిశ్వాసం అందజేశారు. బుధవారం నాటి లోక్సభా జాబితాలో నోటీసు పొందుపరచాలని కోరారు.
మహిళా భద్రత, గోసంరక్షణ దాడులపై ప్రశ్నిస్తాం : కాంగ్రెస్
పార్లమెంట్ సమావేశాల్లో మహిళ భద్రతతో పాటు కొట్టి చంపుతున్న ఘటనలపై ప్రశ్నిస్తామని కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత మల్లిఖార్జునఖర్గే తెలిపారు. ప్రభుత్వం కీలకమైన అంశాలను లేవనెత్తేందుకు విపక్షాలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధికల్పనపై, పెట్టుబడులపై నిలదీస్తామని చెప్పారు.
కొట్టిచంపుతున్న ఘటనలు, మత ఘర్షణలపై నిలదీస్తాం : సీపీఐ(ఎం)
దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న కొట్టిచంపుతున్న ఘటనలతో పాటు మత ఘర్షణలపై పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీస్తామని సీపీఐ(ఎం) ఎంపీ ఎండీ సలీం అన్నారు. పైగా ప్రధానమంత్రి సమాధానం చెప్పా లని డిమాండ్ చేస్తామని చెప్పారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ విభజన విధానాలతో దేశంలో హింసను సృష్టిస్తున్నాయని, దీనికి ప్రభుత్వం వంతపాడుతోందని ఆయన విమర్శించారు.
పార్లమెంట్ సజావుగా సాగేలా చూడాలని కోరాం: జితేందర్రెడ్డి
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని కేంద్రాన్ని కోరామని టీఆర్ఎస్ ఎంపీ జితేం దర్రెడ్డి తెలిపారు. అఖిలపక్ష సమావేశనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు సంబంధించి బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్, ఐఐఎం లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పారు. సభ సజావుగా జరిగితేనే ఈ అంశాలపై చర్చించేందుకు అవకాశముం టుందని తెలిపారు. టీడీపీ రెండు అంశాలపై మద్దతు కోరిందని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. అవిశ్వాస తీర్మానంతో పాటు రాష్ట్ర విభజన సమస్యలపై వాయిదా తీర్మానం ఇస్తే మద్దతు తెలపాలని కోరారని చెప్పారు.