Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుంభకోణాల్లో నిందితులైన వారికి డిప్యూటేషన్
- సీబీఐ వర్గాల్లో ఆందోళన
న్యూఢిల్లీ: వివిధ కుంభకోణాల్లో నిందితులైన అధికారులను తమకు డిప్యూటేషన్పై పంపుతున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి అధికారులను తమ సంస్థలోకి పంపేందుకు కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) నేతృత్వంలోని కమిటీ ఎందుకు తొందరపడుతున్నదని ఈ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. తమ సంస్థలోకి అధికారుల డిప్యూటేషన్పై నిర్ణయాలు తీసుకునే భేటీకి సంస్థ డైరెక్టర్ తరపున ప్రాతినిధ్యం వహించే అధికారం ద్వితీయ స్థాయి సీనియర్ అధికారికి కూడా లేదని ఈ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అనేక ఆరోపణలు, నేర దర్యాప్తులు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులను తమ సంస్థలోకి డిప్యూటేషన్పై పంపేందుకు సీవీసీ నేతృత్వంలో ఏర్పడిన నియామకాల కమిటీకి సీబీఐ ఈ అంశంపై పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఫలితం కన్పించలేదని ఆ వర్గాలు తెలిపాయి.
ఎలాంటి అధికారమూ లేదు
అనేక కేసుల్లో దర్యాప్తులు ఎదుర్కొంటున్న సీబీఐ లోని ద్వితీయ స్థాయి సీనియర్ అధికారి, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్తానాకు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తరపున ప్రాతినిధ్యం వహించే అధికారం ఏ మాత్రం లేదని సీబీఐకి చెందిన విధాన నిర్ణాయక విభాగం సీవీసీకి పంపిన లేఖలో స్పష్టం చేసింది.
ఈ సిఫారసు వెనుక ఎవరు?:కాంగ్రెస్
సీబీఐలోకి కళంకిత అధికారుల డిప్యూటేషన్లను ఎవరు సిఫారసు చేస్తున్నారని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా కేంద్రాన్ని నిలదీశారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలు, దర్యాప్తులు ఎదుర్కొంటున్న కళంకిత అధికారులను సిఫారసు చేస్తున్నది ప్రధాని కార్యాలయమా? లేక ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయమా? బీజేపీ ప్రధాన కార్యాలయమా? అన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవలి కాలంలో మోడీ సర్కారు తన రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు సీబీఐని అస్త్రంగా ప్రయోగిస్తున్నదని ఆయన ఆరోపించారు.
తొందరపాటు తగదు..
నేరారోపణలు, దర్యాప్తులు ఎదుర్కొంటున్న కొంతమంది కళంకిత అధికారులను తమ సంస్థకు పంపే విషయంలో తొందరపాటుతో వ్యవహరించవద్దని ఇటీవలి కాలంలో సీబీఐ , సీవీసీ నేతృత్వంలోని కమిటీకి మూడు లేఖలు రాసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సీబీఐ ప్రత్యేక డైరెక్టర్గా వ్యవహరిస్తున్న రాకేష్ అస్తానాకు సీవీసీ కమిటీ సమావేశాలకు సీబీఐ డైరెక్టర్ తరఫున ప్రాతినిధ్యం వహించే అధికారం లేదని సీబీఐ విధాన నిర్ణాయక విభాగం ఒక లేఖలో స్పష్టం చేసింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో వున్న సీబీఐ డైరెక్టర్ వర్మ ఆమోదంతోనే ఈ లేఖను సంస్థ అధికారులు సీవీసీకి పంపినట్టు తెలుస్తోంది. సీబీఐలో ఎస్పీ స్థాయికి మించిన అన్ని నియామకాలను సీవీసీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ ఆమోదంతోనే నిర్వహించాల్సి వుంటుంది. ఈ కమిటీలో సీవీసీతో పాటు ఇద్దరు విజిలెన్స్ కమిషనర్లు, హోం మంత్రిత్వశాఖ, సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వశాఖల కార్యదర్శులు సభ్యులుగా వుంటారు. కమిటీ సమావేశాలకు సీబీఐ చీఫ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతారు. గుజరాత్లోని ప్రధాన అవినీతి కేసులతో ఆస్తానాకు సంబంధాలున్నట్టు ఆరోపణలున్నాయంటూ సీబీఐ చీఫ్ వ్యక్తం చేసిన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీన్ని బేఖాతరు చేస్తూ గుజరాత్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి ఆస్తానాను సీబీఐ ప్రత్యేక డైరెక్టర్గా గత ఏడాది నియమించటంతో ఈ కమిటీ వ్యవహార శైలిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.