Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి హామీ పథకం నిర్వీర్యం
- కార్మికులకు నష్టం
- మధ్య దళారులు, అక్రమార్కులకే లాభం : ఆర్థికవేత్త జీన్ డ్రెజీ
న్యూఢిల్లీ : సంక్షేమ పథకాల్లో మరింత పారదర్శకత తీసుకురావటం కోసం 'ఆధార్' అనుసంధానాన్ని అమలుజేస్తున్నామని, దీనివల్లే నగదు బదిలీ మరింత ప్రభావశీలంగా మారిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పు కుంటున్నాయి. అయితే దీనిలో నిజం లేదని, వాస్తవానికి 'ఆధార్' అనుసంధానం వల్లే అక్రమ చెల్లింపులు, నిధులు పక్కదారి పట్టడం, నిజమైన లబ్ధిదారులు బలైపో యారని ప్రముఖ ఆర్థికవేత్త, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపశిల్పి జీన్ డ్రెజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
ఆధార్ అనుసంధానం వల్ల ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా ఎలా నిర్వీర్యమైందీ వివరించారు. ''ఉపాధి హామీ పథకంలో చెల్లింపులు చాలా ఆలస్యంగా జరగుతుండేవి. దీనికి తోడు కొత్తగా ఏర్పడిన సమస్య...'ఆధార్' అనుసంధానంతో జరిపిన చెల్లింపుల విధానం. ఏ ఖాతాలోకి డబ్బు వెళుతోంది, వెళ్లలేదన్నది గుర్తించటం కష్టంగామారింది. ఉపాధి హామీ పనులకు వచ్చే వారంతా దాదాపు నిరక్షరాస్యులే. 'ఆధార్' ప్రయోగాలకు మొదట బలైంది ఉపాధి హామీ కార్మికులే. వీరి విషయంలోనే కాదు. సామాజిక పెన్షన్ల చెల్లింపు కూడా గందరగోళంగా మారింది. కొన్ని చోట్ల 'ఎయిర్టెల్ వాలట్'లోకి కూడా సామాజిక పెన్షన్ల డబ్బులు పడ్డాయి. 'ఆధార్ పేమెంట్స్ బ్రిడ్జ్ సిస్టమ్' (ఏపీబీఎస్) వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి'' అని అన్నారు.
అవినీతి తగ్గించలేకపోయారు...
దేశంలో ఎక్కడ కూడా ఉపాధి హామీ పనులు చేసిన కార్మికుడికి సరైన సమయంలో చెల్లింపులు జరగలేదు. అక్రమాల్ని 'ఏపీబీఎస్' విధానం ఏ మాత్రమూ తగ్గించలేకపోయింది. మధ్యవర్తుల, దళారుల ప్రమేయం తగ్గిందని చెప్పగలరా? దీంతో ఉపాధి హామీ పనులంటేనే ఒక విధమైన నైరాశ్యం ఏర్పడేలా చేశారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న మధ్యవర్తులు, దళారులు దీంట్లోకి చొరబడ్డారు. పనులు జరిగినట్టు తప్పుడు పత్రాలు రాసేసి, డబ్బులు మింగుతున్నారు.
పిల్లలే ఈ దేశ భవిష్యత్తు
ప్రభుత్వాలు రాబోయే ఐదేండ్లలో దేనిపై దృష్టిపెట్టాలన్న ప్రశ్నకు సమాధానంగా, ''నేటి పిల్లలే రేపటి దేశ భవిష్యత్తు. రేపటి తరం..నేడున్న పరిస్థితిని మనం చూడాలి. నేటి పిల్లలకు సరైన పోషకాహారం లభ్యం కావటం లేదు. విద్య, వైద్యం అన్నవి చాలా ముఖ్యమైన సేవలు. ప్రభుత్వాలు నేడు వీటిని నిర్లక్ష్యం చేస్తున్నాయి. అలాగే దేశంలో సామాన్య పౌరుడి జీవన స్థితిగతులు మెరుగుపడాలి. అయితే, వీటిపై నరేంద్రమోడీ ప్రభుత్వానికి పట్టింపు లేదు. ప్రపంచంలో శక్తివంతమైన నాయకుడ్ని అనిపించుకోవాలన్న ఆతృత మాత్రం ఉంది.
ఎవరీ జీన్ డ్రెజీ?
బెల్జియంలో పుట్టిన భారతీయ ఆర్థికవేత్త 'జీన్ డ్రెజీ'. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలపై అధ్యయనం చేశారు. ఆర్థిక నోబెల్ గ్రహీత అమర్త్యసేన్తో కలిసి పనిచేశారు. వీరిద్దరూ కలిసి రాసిన 'యాన్ అనసర్టేయిన్ గ్లోరీ : ఇండియా అండ్ ఇట్స్ కాంట్రిడిక్షన్' అన్న పుస్తకం చాలా పాపులర్. యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలకు జాతీయ సలహా మండలి సభ్యుడిగా పనిచేశారు. 'మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం' పథకం తొలి ముసాయిదా భాగమంతా ఈయన చేతులమీదుగానే రూపొందింది.