Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుదీర్ఘ ప్రసంగం... ఎండకు జనం విలవిల
- కుప్పకూలిన విద్యార్థి, జర్నలిస్టు
- ఎర్రకోట వద్ద తెలుగుదనం
న్యూఢిల్లీ. గత ప్రధానులతో పనితీరుతో కాకుండా..ప్రసంగంలో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ పోటీపడుతున్నట్టున్నారు. ఈసారి కూడా ప్రధాని తీరు మారకపోవటంతో.. వీవీఐపీలే కాదు.. సామాన్యజనం కూడా బెంబేలెత్తి పోయారు. ఎర్రకోట వద్ద బుధవారం ఆయన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సుదీర్ఘంగా కొనసాగింది. ఓవైపు మారని ప్రసంగం.. మరోవైపు మంటెత్తిస్తున్న ఎండ వేడిమి దెబ్బకు.. ప్రజలు, విద్యార్థులు, జర్నలిస్టులూ ముచ్చెమటలతో అల్లాడిపోయారు. ఎండ ధాటికి తట్టుకోలేక వీవీఐపీలు ప్లాస్టిక్ విసనకర్రలతో సేద దీరితే.. మరికొందరు తాము తెచ్చుకున్న ఎంట్రీ పాసులే అడ్డుపెట్టుకున్నారు. ఇక జాతీయ గీతం ఆలపించే సమయంలోనే ప్రధాన మంత్రి మోడీ నీరు తాగ డం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాదాపు 82 నిమిషాల పాటు సుదీ ర్ఘంగా సాగిన ప్రసంగంలో పలు పథకాలు, కీలక ప్రకటనలను ఏకరువు పెట్టారు. ఈ ఐదేండ్లలో ప్రధాన మంత్రి మోడీ ఇంత సుదీర్ఘంగా ప్రసంగించడం ఇది మూడోసారి. లోక్సభ ఎన్నికలకు ముందు.. ఇదే చివరి ప్రసంగం కావడంతో ఆయన ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధాని తన ప్రసంగం ఎలా ఉండాలో సూచించాలని ట్విట్టర్లో కోరారు. దీనికి ప్రతిగా.. ఆగస్టు 15న సుదీర్ఘ ప్రసంగాలు వద్దంటూ ప్రజలు మొత్తుకుంటే.. అందుకు సరేనన్నారు. తాము సూచించిన అంశాలు ప్రస్తావిస్తారని ఎదురుచూశారు. కానీ ఆయన మళ్లీ పాత పద్ధతిలోకి వెళ్లిపోవడం గమనార్హం. 2016లో ఆయన అత్యంత సుదీర్ఘంగా 96 నిమిషాల పాటు ప్రసంగించగా, 2017లో 57 నిమిషాల పాటు మాట్లాడారు. మోడీ ఇప్పటి వరకు చేసిన ప్రసంగాల్లో గతేడాది ప్రసంగమే చిన్నది కావడం విశేషం. 2016లో ఆయన చేసిన 96 నిమిషాల ప్రసంగం ఇప్పటి వరకు భారత ప్రధానులు చేసిన అతిపెద్ద ప్రసంగంగా నిలిచింది. 2014లో ప్రధాని మోడీ 65 నిమిషాలు మాట్లాడగా, 2015లో 86 నిమిషాలు ప్రసంగించారు. కాగా మోడీకి ముందు పదేండ్ల పాటు ఆగస్టు 15 సందేశాలు ఇచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎప్పుడూ 50 నిమిషాలకు మించి మాట్లాడలేదు. కేవలం 2005, 2006 సంవత్సరాల్లో మాత్రమే ఆయన 50 నిమిషాల పాటు ప్రసంగించారు. మిగతా ఎనిమిదేండ్ల కాలంలో ఆయన ప్రసంగాలు 32 నుంచి 45 నిమిషాల పాటు మాత్రమే కొనసాగాయి.
విద్యార్థులు విలవిల
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బుధవారం విపరీతమైన వేడి, ఉక్కపోతతో విద్యార్ధులు, సందర్శకులూ నానా అవస్థలూ పడ్డారు. ఓ విద్యార్ధిని స్పహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పాత ఢిల్లీలోని సర్వోదయ కన్య విద్యాలయలో ఏడో తరగతి చదువుతున్న ఫైజా సరిగ్గా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో స్పహ తప్పి పడిపోయింది. కొందరు విద్యార్ధులు, ఉపాధ్యాయులు కలిసి ఓస్ట్రెచర్పై ఆమెను అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లారు. వైద్యులు ఆమెను పరీక్షించి ఎన్ఎన్జేపీ ఆస్పత్రికి తరలించారు. ''వడదెబ్బ'' కారణంగానే ఆమె అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. కాగా ప్రదర్శన ఇచ్చేందుకు ఉదయం నుంచే తాము ప్రాక్టీస్ చేస్తున్నామనీ, కానీ ఇక్కడ కనీసం మంచినీళ్ల సదుపాయం కూడా ఏర్పాటు చేయలేదని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా కారణాల రీత్యా ఉదయం 6:30 గంటలకే వేదిక వద్దకు రావాలని అధికారులు సూచించారు. 7 గంటల కల్లా వేడుకలు ప్రారంభం కాగా తగినంత తాగునీటి వసతి లేకపోవడంతో చాలామంది దాహంతో విలవిల్లాడారు. ఒక్క బాటిల్ నీళ్ల కోసం తాము చాలా శ్రమించాల్సి వచ్చిందని, ప్రాక్టీస్ చేసి చాలా అలసిపోయామని, విపరీతమైన దాహంతో పాటు ఎండవేడిమితో మరింత ఇబ్బందిపడాల్సి వచ్చిందని ఓ విద్యార్ధి పేర్కొన్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్న సమయంలో ఓ జర్నలిస్టు కూడా సొమ్మసిల్లి పడిపోయారు. అయితే కొద్ది సేపటికే కోలుకున్న ఆయన చాలా సేపు నేలమీదనే కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు. ఉదయం 5:30 గంటలకే ఢిల్లీలో తేమశాతం 72 శాతం ఉండగా రెండు గంటల వ్యవధిలోనే అది 88 శాతానికి చేరింది. 7:15 సమయంలో ఎర్రకోట వద్దకు వచ్చిన ప్రధాని మోడీ 7:30కి జెండా ఆవిష్కరించి, తన ప్రసంగం ప్రారంభించారు. అదే సమయంలో పలుమార్లు చేతిరుమాలుతో ముఖం తుడుచుకోవడం కనిపించింది.
ఎర్ర కోట వద్ద తెలుగు దనం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎర్ర కోట వద్ద తెలుగు దనం ఒట్టిపడింది. ఆంధ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలుగు సాంప్రదాయ వస్త్రాదారణతో వేడుకల్లో పాల్గొన్నారు.