Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటి దిగ్బంధనంలోనే కేరళ
- 14 జిల్లాలకు రెడ్ అలర్ట్
తిరువనంతపురం : జల ప్రళయం కేరళను వీడటంలేదు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో జల దిగ్బంధనంలో అతలాకుతలమవుతున్నది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంతో చనిపోయిన వారి సంఖ్య 67కు చేరింది. శనివారం ఒక్క రోజే 25 మంది మృతిచెందగా, అందులో ఒక్క మల్లప్పురంలోనే 11 మంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. కాగా, మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటన ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నది. వాతావరణ శాఖ ప్రకటన నేపథ్యంలో 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నీరు ప్రమాదస్థాయిని చేరడంతో శనివారం నాటికి రాష్ట్రంలోని 39కిగాను 33 డ్యామ్ల గేట్లను ఎత్తివేసినట్టు అధికారులు తెలిపారు.
అధికారులతో సీఎం అత్యవసర సమావేశం
'రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత విపత్కర పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. దాదాపు అన్ని డ్యాంల గేట్లు ఎత్తివేశారు. రాష్ట్రంలో సగ భాగంపైగా నీట మునిగి వుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రజలకు తాగు నీరు అందించడం ఇప్పుడు మా తొలి ప్రాధాన్యత' అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ట్వీట్ చేశారు.
మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరిక నేపథ్యంలో అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిందిగా సహాయ బృందాలను కోరారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోడీకి విజయన్ ఫోన్ ద్వారా రాష్ట్ర పరిస్థితిని వివరించారు. ఎలాంటి సహాయం అందించేం దుకైనా కేంద్రం సిద్ధంగా ఉందని విజయన్కు మోడీ హామీ ఇచ్చారు.