Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హజీపూర్ : వైశాలి జిల్లాలో బ్లాక్ అధ్యక్షుడి హత్య కేసుకు సంబంధించి పాలక జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యే, మరో 9మందిపై ఎఫ్ఐఆర్ నమోదైందని పోలీసులు తెలిపారు. సోమవారం జరిగిన మనీష్ సాహ్ని హత్య కేసులో జందాహా పోలీసు స్టేషన్లో పది మందిపై కేసు నమోదైందని, వీరిలో మన్హర్ ఎమ్మెల్యే ఉమేష్ సింగ్ కుష్వాహా వున్నారని వైశాలి ఎస్పీ మన్వజిత్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. చనిపోయిన వ్యక్తి రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి చెందినవాడు. ఈ నెల ఆరంభంలో సాహ్ని బ్లాక్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడని, అది ఎమ్మెల్యేకు, ఆయన మద్దతుదారులకు ఆగ్రహం కలిగించిందని సాహ్ని సోదరుడు ప్రకాష్ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సాహ్ని గెలవడానికే అనుమతించబోమని, ఒకవేళ గెలిచినా జీవించేందుకు అనుమతించమని గతంలోనే ఎమ్మెల్యే బెదిరించారని ప్రకాష్ తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారి తెలిపారు.