Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : ఏపీలో ఈ మారు ఖరీఫ్ సేద్యం భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీజనుకు గడువు సెప్టెంబర్ నెలాఖరు. ఆగస్టు సగంలో పడ్డా పంటల సాగు ఏమంత ఆశాజనకంగా లేదు. సాగునీటికి గ్యారంటీ ఉన్న డెల్టా ప్రాంతాల్లో మినహా తతిమ్మా చోట్ల సాగు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుంది. వాయు గుండం, అల్పపీడనాల వల్ల నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కొన్ని జిల్లాలకే పరిమితమయ్యాయి. సీజను తొలినాళ్ల నుంచీ వర్షాభావం ఎదు ర్కొంటున్న రాయలసీమ, దక్షిణాంధ్రలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చెదురుమదురు వానలే పడ్డాయి. వారం క్రితం గుంటూరు, విజయనగరం జిల్లాలు వర్షాభావ సమస్యను ఎదుర్కోగా ప్రస్తుత వర్షాలతో అవి సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇంకా ఆరు జిల్లాల్లో తక్కువ వర్షపాతమే కొనసాగుతోంది. కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, నెల్లూరుల్లో వర్షాభావం ఉంది. వారం క్రితం 403 మండలాల్లో తక్కువ వర్షం నమోదుకాగా ఆగస్టు 16 సాయంత్రానికి 334 మండలాలకు తగ్గాయి. ఆగస్టు మాసంలో 8వ తేదీ నాటికి వర్షపులోటు 40 శాతం కాగా ప్రస్తుతం ఒక శాతం తక్కువ వర్షం నమోదైంది. వారంలో 50 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఆ మేరకు వర్షాభావ ప్రాంతాలు కాస్తంత తెప్పరిల్లాయి.
ఈసారి 'కోత'లే
ఖరీఫ్లో అదనుకు అన్ని ప్రాంతాల్లోనూ ఆశాజనకంగా వానలు పడకపోవడం, సుదీర్ఘకాలం వర్షానికి వర్షానికి మధ్య అంతరం (డ్రైస్పెల్) తిష్ట వేయడం వలన ఈ ఖరీఫ్లో లక్ష్యాల మేరకు సాగు సాగే పరిస్థితి లేదని, విస్తీర్ణం భారీగా తగ్గుతుందని పలు ప్రభుత్వ విభాగాలు ముందస్తు అంచనాలు వేస్తున్నాయి. ఆగస్టు 15 నాటికి సాగు కావాల్సిన దాంట్లో సుమారు లక్ష హెక్టార్ల మేర లోటు ఉందని వ్యవసాయశాఖ నివేదిక వెల్లడించింది. ఇప్పటి వరకు వరి నాట్లు ఆశాజనకంగా ఉన్నాయని చెపుతున్నా అన్ని ప్రాంతాల్లో కాదు. నీటి వసతి ఉన్న దగ్గరే వరి నాట్లు పడుతున్నాయి. మెట్ట ప్రాంతాల్లో వరి దాదాపు నిలిచిపోయింది. చిరుధాన్యాలను రైతులు ముందస్తుగా సాగు చేస్తారు. మొక్కజొన్న, జొన్న, రాగి తదితరాలను ఆగస్టు తర్వాత సాగు చేయరు. దీన్నిబట్టి చూస్తే చిరుధాన్యాల సేద్యం సుమారు లక్ష హెక్టార్లలో తగ్గనుంది. పప్పులు సైతం అదే పరిస్థితి. అవి కూడా ఈ ఖరీఫ్లో లక్ష హెక్టార్లలో తగ్గుతాయని అంచనా.
పెసరకు వానల దెబ్బ
పెసర్లు ఇప్పటి వరకు పది వేల హెక్టార్లలో సాగు చేయగా రోజుల తరబడి వర్షాల వలన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోతకొచ్చిన పంట దెబ్బతింది. ఈ రెండు జిల్లాల్లో కలిపి మూడు వేల హెక్టార్లలో పెసర పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ వెల్లడించగా నష్టం ఇంకా ఎక్కువేనని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా కొన్ని ప్రాంతాల్లో వరి సాగు ఆశాజనకంగా ఉన్నందున చిరుధాన్యాలు, పప్పులు తగ్గినప్పటికీ ఆహార పంటల సాగు సాధారణ స్థాయిలో సాగుతోంది.
వేరుశనగ తీసికట్టు
వేరుశనగ అధికంగా సాగు చేసే రాయలసీమలో నేటికీ వర్షాభావం ఉన్నందున ఆ పంట సాగు గణనీయంగా తగ్గనుంది. సుమారు మూడున్నర లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగయ్యే అవకాశం లేదు. వేరుశనగ ప్రభావం నూనెగింజల సాగుపై పడింది. దీంతో ఈ తడవ నూనెగింజల విస్తీర్ణం నాలుగు లక్షల హెక్టార్లు తగ్గిపోనుంది. వాణిజ్యపంటల్లో ప్రధానమైన పత్తి సాగు కూడా అంత బాగా లేదు. లక్షన్నర హెక్టార్లలో ఈ ఏడాది పత్తి సాగు తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. చెరకు, మిరప, ఉల్లి సాగు కూడా తగ్గే పరిస్థితులున్నాయి.
ఆగస్టు 15 నాటికి పంటల సాగు (లక్షల హెక్టార్లలో)
పంట ఖరీఫ్ ఆగస్టు 15 నాటికి సాగైంది
సాధారణ సాగు సాగు కావాల్సింది
వరి 15.50 8.55 9.99
చిరుధాన్యాలు 2.21 1.30 1.34
పప్పుధాన్యాలు 3.19 1.84 1.71
మొత్తం ఆహారధాన్యాలు 20.90 11.68 13.04
వేరుశనగ 8.31 6.70 4.45
మొత్తం నూనెగింజలు 9.07 7.27 4.90
పత్తి 6.52 4.62 4.52
మొత్తం పంటలు 39.53 25.28 24.19