Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిట్ దర్యాప్తులో గౌరీలంకేశ్ హత్య కేసు నిందితుడి వెల్లడి
బెంగళూరు : గౌరీలంకేశ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు పరశురాం వాఘ్మేర్ను గౌరీ ఇంటికి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లిన ఆరోపణలతో అరెస్టయిన గణేశ్ మిస్కిన్.. ఈ కేసు విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో కీలకాంశాలను వెల్లడించాడు. ప్రముఖ హేతువాది ఎంఎం కాల్బుర్గీ హత్యలోనూ తన ప్రమేయమున్నట్టు మిస్కిన్ అంగీకరించాడు. 2015లో కాల్బుర్గీని హతమార్చేందుకు తన ఇంటికి వెళ్లినవారిలో తనూ ఉన్నాడని వివరించాడు. గౌరీ హత్యలో మాస్టర్ మైండ్ అమోల్ కాలే.. కాల్బుర్గీ మర్డర్లోనూ ప్రధాన పాత్రపోషించాడని తెలిపాడు. అమోల్ కాలే తన మిత్రుడు అమిత్ దేగ్వెకర్లు కలిసి మహారాష్ట్ర, కర్నాటకలోని హేతు వాదులను హతమార్చిన కుట్రలో భాగస్వాములని మిస్కిన్ వెల్లడించాడు. గౌరీలంకేశ్ హత్యకేసులో అరెస్టయిన 12మందిలో చాలామంది హిందూ జనజాగృతి సమితి (హెచ్జేఎస్), సనాతన సంస్థకు చెందినవాళ్లే. ఈ రెండు సంస్థలకు చెందిన వారు.. గౌరీలంకేశ్, కాల్బుర్గీ హత్య కేసులతోపాటు గోవింద్ పన్సారే, నరేంద్ర ధబో ల్కర్ హత్య కేసుల్లోను నిందితులుగా ఉండటం గమనార్హం. పేలుడ పదార్థాలు కలిగి ఉండటంతో ఈ సంస్థలకు చెందినవారిని ఇటీవలే మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేశారు. వీరిద్దరి హత్యలో ఒకే తుపాకీని వినియోగించినట్టు ఇదివరకే సిట్ తేల్చింది. మిస్కిన్ సహా మరో ముగ్గురి వాంగ్మూలాలు ఈ రెండు హత్యకేసుల లింక్లను కాల్బుర్గీ హత్యకేసును దర్యాప్తు చేసున్న సీఐడీకి సిట్ అందజేసిన విషయం తెలిసిందే.