Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామస్తుల ఆందోళన
రాంచీ: జార్ఖాండ్లోని దూంకా జిల్లాలో ఉన్న బరపలసి రైల్వే స్టేషన్లో ఆరేండ్ల బాలిక మృతదేహం కలకలం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు పోలీసులపై రాళ్లు విసరడంతో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. కాగా బాలికను హత్య చేశాడని ఆరోపిస్తూ రైల్వే స్టేషన్లో మతిస్థిమితం సరిగాలేని ఓ వ్యక్తిపై గ్రామస్తులు విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని అతడిని రక్షించారు. స్టేషన్లోని బాత్రూంలో నుంచి పోలీసులు బాలిక మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చిన అనంతరం ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు వారిపై ఇటుకలు, రాళ్లువిసరడంతో ముగ్గురు పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఎస్పీ కౌశల్ కిశోర్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నామని ఆయన అన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంలో పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు కౌశల్ వివరించారు.