Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విష జ్వరాలు, డెంగీతో నెలలో 33 మంది మృతి
- ఎక్కువమంది డెంగీతోనే
విజయనగరం : విజయనగరం జిల్లాలో మృత్యుఘోష వినిపిస్తోంది. డెంగీ, మలేరియా జ్వరాల కారణంగా మన్యం, మైదానం అనే తేడా లేకుండా జనం పిట్టల్లా రాలుతున్నారు. నెల రోజుల వ్యవధిలో 33 మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. తాజాగా విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి చీమకుర్తి సాయినివాస్ (14) డెంగీ లక్షణాలతో గురువారం మృతి చెందాడు. ఆంజనేయపురం అన్నపూర్ణ కాలనీకి చెందిన ఆ విద్యార్థి గరివిడి అభ్యాస్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సోమవారం జ్వరం రావడంతో విజయనగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. అయినా, జ్వరం తగ్గకపోవడంతో విశాఖలోని ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో ప్లేటులెట్లు పూర్తిగా తగ్గిపోయినట్టు గుర్తించారు. చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గరివిడి మండలం బొండపల్లికి చెందిన బాలింత ఒలిగింటి జానకి (23), సోమవారం విశాఖ కేజీహెచ్లో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ప్రసవం సమయంలో ఆమె బిడ్డ కూడా చనిపోవడం ఆ కుటుంబానికే కాకుండా జిల్లాలో తీవ్ర విషాదం మిగిల్చింది. ఎస్.కోట మండలం సీతంపేటకు చెందిన నాలుగేండ్ల చిన్నారి మోనిషా ఈ నెల ఆరున మృతి చెందింది. ఎస్.కోటకు చెందిన బత్తిన సూరీడమ్మ ఈ నెల పదిన ప్లేట్లెట్లు తగ్గి మరణించింది. ఈ విధంగా 33 మరణాలు వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి రాని మరణాలు ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరిలో ఎక్కువమంది డెంగీతో మృతిచెందారు. ఇప్పటికే వందలాది మంది డెంగీ బారినపడి ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.