Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నేత తరిగామి
శ్రీనగర్: కాశ్మీర్ సమస్య విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లిప్త వైఖరితో ఏర్పడుతున్న సామూహిక ఏకాకితనంతో కాశ్మీరీలలో నిస్సహాయత, నిరాశ, నిస్పృహలు నానాటికీ పెరిగిపోతున్నాయని సీపీఐ(ఎం) ఎమ్మెల్యే మహ్మద్ యూసుఫ్ తరిగామీ ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి రాజకీయ ప్రక్రియను విస్తృత స్థాయిలో ప్రారంభించాల్సిన అవసరం వుందని పలువురు నిపుణులు దీర్ఘకాలంగా కేంద్రానికి పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా ఎటువంటి ప్రయోజనమూ కలగడం లేదని గురువారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో చెప్పారు. దురదృష్టవశాత్తు ప్రధాని తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా కాశ్మీర్ విషయంలో పాత పాటే పాడారు తప్ప ప్రజల వినతులేవీ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. కాశ్మీర్లో తలెత్తుతున్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా స్పందించేందుకు కేంద్రం సిద్ధంగా లేదన్న విషయాన్ని ప్రధాని ప్రసంగం తెలియచేస్తోందన్నారు. గత ఏడాది కూడా ప్రధాని తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఇదే పాట పాడారని, ఒక్క అక్షరం కూడా మార్చలేదని, అయితే కాశ్మీర్లో పరిస్థితి మాత్రం నాటికన్నా ఇప్పుడు మరింత దిగజారిందని ఆయన తెలిపారు. రక్తమోడుతున్న కాశ్మీర్లో ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసం నింపే చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అయితే దురదృష్టవశాత్తు ప్రధాని ప్రసంగంలో మాత్రం ఈ అంశం మాట మాత్రం కూడా ప్రస్తావనకు రాలేదని అన్నారు. ప్రధాని తన ప్రసంగంలో ప్రభుత్వం కాశ్మీర్ అంశాన్ని 'గోలి, గాలి'(రాళ్లు, బుల్లెట్లు) పరిష్కరించలేవని చెబుతున్నారని, అయితే వాస్తవ పరిస్థితిలో మాత్రం భద్రతా దళాలు అత్యుత్సాహంతో బలప్రయోగం చేస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారని ఆయన వివరించారు. రాజ్యాంగంలోని 35ఎఅధికరణ విషయంలో ప్రధాని నుంచి కాశ్మీరీలు నిర్దిష్టమైన హామీలు కోరుతున్నారని ఆయన తెలిపారు. ప్రాంత, కుల, మత భేదాలకతీతంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలందరూ ఆర్టికల్ 35ఎ కొనసాగాలని కోరుకుంటున్నారని, అయితే ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టులో దీనిని సమర్ధించటం లేదని అన్నారు. ఆర్టికల్ 35ఎ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్య పిటిషన్పై కేంద్రం ఇప్పటి వరకూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదని ఆయన గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల రాజ్యాంగ హక్కుల పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ చూపటంలేదని తాను భావిస్తున్నానని, ఇది రాష్ట్రంలో మరింత అనిశ్చితికి, ఏకాకితనానికి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు.