Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడుకు సుప్రీం ఆదేశం
- ముల్లపెరియార్ డ్యాం నుంచి నీరు దిగువకు విడుదల
కొచ్చి : కేరళలో వరదలతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని, ఈ సమయంలో విరోధిగా వ్యవహరించవద్దని కేరళ, తమిళనాడు ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ముల్లపెరియార్ ఆనకట్ట నుండి నీటిని విడుదలకు సంబంధించి కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుండటంతో సుప్రీంకోర్టు పైవిధంగా పేర్కొంది. విపత్తు సమయాలలో రెండు రాష్ట్రాలు సమన్వయం, సామరస్యం కలిగి ఉండాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో శుక్రవారం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జాతీయ విపత్తుల నివారణ కమిటీని ఆదేశించింది. ఆ కమిటీ విపత్తు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేసి తమిళనాడు, కేరళ ప్రభుత్వాలకు ఇవ్వాలని సూచించింది. అనంతరం ఈ నివేదికను కోర్టుకు సమర్పించాల్సిందిగా ఆదేశించింది. కాగా, ముల్లపెరియార్ డ్యామ్లో నీరు ప్రమాదకరస్థాయికి చేరుకోవడంతో గేట్లను ఎత్తి నీటిని కొద్దికొద్దిగా దిగువకు విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేరళ ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. 2015లో తమిళనాడు రాజధాని చెన్నైని వరదలు ముంచెత్తినపుడు అన్ని ఆనకట్టలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని, కాని ముల్లపెరియార్ డ్యాం భద్రంగాఉందని తమిలనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, విచారణ అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ముల్లపెరియార్ డ్యామ్ సురక్షితమని కేరళ ముఖ్యంత్రి పినరయి విజయన్కు తెలిపారు. 142 అడుగుల వరకు నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని డ్యామ్ కలిగివుందని కోర్టు నియమించిన పర్యవేక్షక కమిటీ తెలిపింది. దీంతో నీటిని గరిష్ట స్థాయిలో వైగైఆనకట్టకు విడుదల చేస్తామని పళనిస్వామి కేరళ సిఎంకు చెప్పినట్లు సమాచారం. 130 ఏళ్ల కిందట నిర్మించిన ఈ డ్యామ్పై కేరళ, తమిళనాడు ప్రభుత్వాల మధ్య విబేధాలు తలెత్తడంతో 1886లో ట్రావెన్కోర్ మహారాజు, బ్రిటీష్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం తమిళనాడు ప్రభుత్వం ఈ డ్యామ్ నిర్వహణ చేపట్టింది.