Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ ధర్మాసనానికి కేంద్రం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ఎస్సీ,ఎస్టీలకు ఉద్యోగ పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయక తప్పదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. పదోన్నతుల్లో కోటా అమలుకు సంబంధించి 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేంద్రం సూచించింది. 12 ఏండ్ల క్రితం ఎం నాగరాజు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పలు వ్యాజ్యాలు దాఖలు కావడంతో రాజ్యాంగ ధర్మాసనం పున:పరిశీలిస్తోంది. ఈ సందర్భంగా కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఎస్సీ,ఎస్టీలలో వెనకబాటుతనాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేకంగా డేటా సేకరణ కూడా అవసరంలేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం స్పష్టం చేసింది. ఏదైనా కులాన్నీ లేదా తెగని ఎస్సీల్లో లేదా ఎస్టీల్లో చేర్చేముందే వారు ఎదుర్కొంటున్న బాధల్నీ, వెనకబాటుతనాన్నీ పరిగణనలోకి తీసుకుంటారని కేంద్రం తెలిపింది. నాగరాజు కేసులో ఎస్సీ,ఎస్ట్లీలకు మీగడ తరగతి సూత్రం వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓబీసీ రిజర్వేషన్ల విషయంలో మీగడ తరగతి సూత్రాన్ని అనుసరిస్తున్న విషయం గమనార్హం. ఓబీసీల్లో అధిక ఆదాయం కలిగినవారికి(మీగడ తరగతికి) రిజర్వేషన్లు పొందే హక్కులేదు.