Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖుల సంతాపం
- నేడు అంత్యక్రియలు
- ఏడు రోజులు సంతాపదినాలు : కేంద్రం
కవిగా,పాత్రికేయిడిగా..దేశప్రధానిగా ఒక్కో మెట్టు ఎక్కి..ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగిన అటల్బిహారీ వాజ్పేయి(93) కన్నుమూశారు. గత మూడు నెలల నుంచి తీవ్ర అనారోగ్యసమస్యలతో చికిత్సపొందుతున్న మాజీ ప్రధాని గురువారం తుదిశ్వాస విడిచారని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. వాజ్పేయి ఇకలేరన్న వార్త ఆ పార్టీ శ్రేణుల్లో విషాదం నింపింది. ఆయన అస్తమయంపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. శుక్రవారం అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించటానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నది.
న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. కొన్నేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్పేయి ఇటీవలే తీవ్ర అస్వస్థతతో ఎయిమ్స్లో చేరారు. కిడ్నీ ఇన్ఫెక్షన్, ఛాతీ నొప్పి, మూత్ర సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు తొమ్మిది వారాలుగా చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఎయిమ్స్ నుంచి ఆయన పార్ధీవదేహాన్ని న్యూఢిల్లీ కృష్ణ మీనన్ మార్గ్లోని ఆయన నివాసం వద్దకు తరలించారు. ఆయన మృతదేహం వద్ద పలువురు ప్రముఖులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భారతదేశ రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్పేయిది చెరగని ముద్ర. మాజీ ప్రధాని మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 1924 డిసెంబరు 25న మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజ్పేయి. వాజ్పేయి గ్వాలియర్లోని సరస్వతి శిశుమందిర్లో విద్యాభ్యాసం చేశారు. అనంతరం విక్టోరియా కళాశాలలో డిగ్రీ చదివారు. కాన్పూరులోని ఆంగ్లో వైదిక కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు.
1957లో తొలిసారి ఎంపీగా..
1957లో వాజ్పేయి బలరామ్పూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం 1968లో జనసంఫ్ు జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1996లో తొలిసారి 13 రోజులు ప్రధానిగా, తర్వాత 13 నెలల పాటు మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది ఐదేండ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. అటల్ బిహారీ వాజ్పేయి పది సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన రెండో లోక్సభ నుంచి 14వ లోక్సభ వరకూ ఎంపీగా ఉన్నారు. 1984లో ఆయన గ్వాలియర్లో కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావ్ సింధియా చేతిలో ఓటమి పాలయ్యారు.
ఐదేండ్లు పూర్తిచేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రధాని
ఐదేళ్లు పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు స ష్టించారు. భారత దేశానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించింది. 2005 తర్వాత అనారోగ్య కారణాలతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2005లో ముంబయిలోని శివాజీ పార్క్లో జరిగిన బీజేపీ రజతోత్సవ వేడుకల్లో తాను ఎన్నికల రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్టు వాజ్పేయి ప్రకటించారు. 2009లో ఎంపీగా తన పదవీకాలం పూర్తయ్యాక ఆయన మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.
నెహ్రూతో 'భవిష్యత్ ప్రధాని' అనిపించుకున్న వాజ్పేయి
నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్పేయిలో ఆయనలో భవిష్యత్ ప్రధానిని చూశారు. ఓసారి భారత పర్యటనకు వచ్చిన బ్రిటిష్ ప్రధానమంత్రికి వాజ్పేయిని పరిచయం చేస్తూ నెహ్రూ.. 'భవిష్యత్తులో ప్రధాని కాగల వ్యక్తి' అంటూ పరిచయం చేశారు. అంతర్జాతీయ ఒత్తిళ్లకు భయపడి అణు పరీక్షల గురించి బయట ప్రపంచానికి తెలియజేయని నాయకులకు భిన్నంగా అణు పరీక్షలు జరిపి బాహాటంగా ప్రకటించారు వాజ్పేయి.
వాజ్పేయి పంథావేరు..
'రాజకీయాలకు విలువలిచ్చారు. సిద్దాంతపరగా వెనుకడుగువేయలేదు. ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలింది. అప్పుడు కూడా ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ నా సర్కారును కాపాడటానికి అడ్డదారులకు వెళ్లను. అలాంటి ప్రభుత్వాన్ని నా భుజస్కంధాలపై వేసుకుని నడపలేను' అని వాజ్పేయి అన్న మాటలు మరువలేనివి. పోఖ్రాన్ పరీక్షలనుంచి చతుర్ధిగోల్డ్న్ కారిడార్ పేరుతో రహదారుల అభివృద్ధిలాంటి పనులతో దేశప్రజల ఆదరణ చూరగొన్నారు.
స్మృతి స్థల్లో నేడు అంత్యక్రియలు
వాజ్పేయి అంత్యక్రియలను శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్నారు. కృష్ణ మీనన్ మార్గ్లోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై బీజేపీ కేంద్ర కార్యాలయం దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గ్, ఢిల్లీ గేటు, రాజ్పత్ గుండా స్మృతి స్థల్కు చేరుకుంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. వాజ్పేయి స్మృతి చిహ్నం నిర్మించేందుకు రాష్ట్రీయ స్మృతి స్థల్లో ఎకరంన్నర స్థలాన్ని కేటాయించారు.
ఏడు రోజుల సంతాపదినాలు : కేంద్రం
ఏడు రోజులపాటు సంతాపదినాలను కేంద్రం ప్రకటించింది. వాజ్పేయి గౌరవార్థం జాతీయ జెండాను అవనతం చేశారు. ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించే ఏర్పాట్లను చేసేందుకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజధానికి చేరుకున్నారు. ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కాగా, మాజీ ప్రధాని గౌరవార్థం ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం సెలవు దినంగా ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర సంస్థలు మూసివేస్తున్నట్టు తెలిపింది.
దేశప్రజలకు తీరనిలోటు.
''వాజ్పేయి కన్నుమూత దేశ ప్రజలకు తీరనిలోటు. అటల్ జీ లేరన్న వార్త నన్నెంతగానో కలచివేసింది. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా''
- రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
భారత రాజకీయ భీష్ముడు వాజ్పేయి
'' దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. భారత రాజకీయ భీష్ముడు వాజ్పేయి. ఉదారవాది, మానవతావాది, కవి, సిద్ధాంత కర్త, వక్త, అత్యుత్తమ పార్లమెంటేరియన్. ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోయినా చలించని మేరునగధీరుడు''
- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి
'అటల్ జీ లేరన్నది ఎంతో దుఃఖదాయకం. ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ప్రేరణ, మార్గదర్శనం ప్రతి భారతీయుడికి అండగా ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా'
- ప్రధానమంత్రి నరేంద్రమోడీ
దేశం గొప్ప నాయకుడ్ని కోల్పోయింది
'దేశం గొప్ప నాయకుడిని కోల్పోయింది. వాజ్పేయీ ప్రజల ఆదరాభిమానాలు, ప్రేమ చూరగొన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు.
- కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ
అన్ని వర్గాల ఆదరణ : సీపీఐ(ఎం)
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధాని వాజ్పేయి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన అన్ని వర్గాల ప్రజల గౌరవాన్ని పొందారు. ఆయన మృతిపట్ల సీపీఐ(ఎం)పొలిట్ బ్యూరో తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
విలువలతో కూడిన రాజకీయం
'ఉత్తమ పార్లమెంటేరియన్గా విలువలతో కూడిన వ్యక్తి వాజ్పేయి. విలువలతో కూడిన రాజకీయాలను నడిపి దేశానికే ఆదర్శంగా నిలిచిన నేత. వాజ్పేయీ ఉదారవాది, మానవతావాది, కవి, సిద్ధాంతకర్త, వక్త, నిరాడంబరుడు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన అటల్ ఆత్మకుశాంతి చేకూరాలి'
- ముఖ్యమంత్రి కేసీఆర్