Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంటులో ఆమోదం పొందకపోవడంతో దీనిని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ట్రిపుల్ తలాక్ను శిక్షార్హమైన నేరంగా పరిగణించే ఆర్డినెన్స్కు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కాగా, కేంద్రం గత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్య సభలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో బిల్లులో మూడు సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదం అనంతరం ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో కేంద్ర న్యాయశాఖ, ఐటీ మంత్రి రవిశంకర్ప్రసాద్ వెల్లడించారు. మొదటి సవరణ ప్రకారం.. ప్రతిపాదిత చట్టం 'నాన్ బెయిలెబుల్' అయినప్పటికీ.. తలాక్ చెప్పినవారు బెయిల్ కోసం మేజిస్ట్రేటును ఆశ్రయించవచ్చు. ఆర్డినెన్స్ కింద అరెస్టయిన వ్యక్తికి మేజిస్ట్రేటు నుంచి బెయిల్ పొందే అవకాశం ఉంది. రెండో సవరణ ప్రకారం.. ట్రిపుల్ తలాక్ విషయంలో బాధితురాలు(భార్య), ఆమె రక్త సంబంధీకులు, బంధువుల ఫిర్యాదు మేరకే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అదేవిధంగా బాధితురాలి వాదనలు విన్న తర్వాతే బెయిల్పై మేజిస్ట్రేటు నిర్ణయం ఉంటుంది. ఇక మూడో సవరణ ప్రకారం.. మేజిస్ట్రేటు తన అధికారాలు ఉపయోగించి భార్య, భర్తల మధ్య వివాదాన్ని సెటిల్ చేయవచ్చు. ఇరు వర్గాలు కేసును వాపసు తీసుకోవచ్చు. ట్రిపుల్ తలాక్ విషయంలో గతేడాది పార్లమెంటు ముందుకు తీసుకు వచ్చిన 'ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు' విషయంలో కాంగ్రెస్ సహకరించకపోవడం కారణంగా అది ముందుకు పోలేదని ఆయన ఆరోపించారు.
కాగా, ఈ ఆర్డినెన్సు ముస్లిం మహిళల న్యాయం కోసం తీసుకురాలేదని, దీనిని రాజకీయం అంశంగా మలిచేందుకే కేంద్రం ప్రయత్నమని కాంగ్రెస్ మండిపడింది. ఆర్డినెన్సు ముస్లిం మహిళలకు వ్యతిరేకమని, ఇది వారికి ఏ మాత్రం న్యాయాన్ని చేకూర్చదని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. మరోపక్క, ట్రిపుల్ తలాక్పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఇష్రత్ జహాన్ ఆర్డినెన్సును స్వాగతించారు.