Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురి సంతాపం
విశాఖ : అభ్యుదయ వాది, స్వాతంత్య్ర సమర యోధులు, రచయిత్రి, మహిళా ఉద్యమ నేత కొండపల్లి కోటేశ్వరమ్మ బుధవారం వేకువజామున విశాఖలోని మనుమరాలు సుధ నివాసంలో తుదిశ్వాస విడిచారు. వందేండ్లు నిండిన ఆమెకు ఆగస్టు 5న శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. పది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే నగరంలోని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు, సీపీఐ ఏపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి, ప్రజానాట్యమండలి, వివిధ ప్రజాసంఘాల నాయకులు ఆమె పార్థివదేహాన్ని సందర్శించి జోహార్లు అర్పించారు. ఆమె కోరిక మేరకు భౌతికకాయాన్ని కేజీహెచ్కు మధ్యాహ్నం అందజేశారు. ఆమె మనుమరాళ్లు అనురాధ, సుధ, కుటుంబ సభ్యులు అంతిమ వీడ్కోలు పలికారు.
కొండపల్లి కోటేశ్వరమ్మ జాతీయోద్యమంలో పాలుపంచుకున్నారు. ఆ తరువాత విప్లవోద్యమానికి అంకితమయ్యారు. సామ్యవాదరాజ్యం రావాలని, సమసమాజం ఏర్పడాలని కలలుకన్నారు. చిన్నప్పుడే అభ్యుదయ భావాలను పుణికిపుచ్చుకున్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమంలో భర్త కొండపల్లి సీతారామయ్యతో కలిసి పోరు బాట పట్టారు. కన్న బిడ్డలు రమేష్, కరుణలకు అదే బాట చూపారు. తొమ్మిది దశాబ్దాలుగా పోరుబాటలో పయనించిన బాటసారి ఆమె. కోటేశ్వరమ్మ స్వగ్రామం కృష్ణా జిల్లా పామర్రు. తల్లి అంజమ్మ, తండ్రి సుబ్బారెడ్డి. ఎగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆమె కడవరకూ పేదల తరఫున పోరాడారు. 1931లో మహాత్మా గాంధీ బందరు వెళుతూ పామర్రు వచ్చినప్పుడు తన ఒంటి మీద ఉన్న నగలను తీసి గాందీజీó దోసిలిలో పెట్టారు. పుచ్చలపల్లి సుందరయ్యకు మానస పుత్రికగా, చండ్ర రాజేశ్వరరావుకు ప్రియ సోదరిగా ఆనాడు కోటేశ్వరమ్మను గురించి కార్యకర్తలు చెప్పుకొనేవారు. తన జీవిత గాథను 'నిర్జన వారధి'గా ఆమె గ్రంధస్తం చేశారు. ఆ పుస్తకాన్ని నాలుగు భాషల్లో ప్రచురించారు. పోరాట యోధురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) తెలంగాణ,ఏపీరాష్ట్ర కమిటీలు సంతాపాన్ని ప్రకటించాయి ఈమేరకు తెలంగాణ,ఏపీ పార్టీ రాష్ట్ర కార్య దర్శులు తమ్మినేని వీరభద్రం, పి.మధు బుధవారం ఒక ప్రకటన విడు దల చేశా రు. మహిళా ఉద్యమంలో కోటేశ్వరమ్మ కీలకపాత్ర పోషించారని వారు పేర్కొ న్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రఘు వీరారెడ్డి, ఐద్వా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి, కార్యదర్శి డి.రమాదేవి, ఎఐకెఎస్ ఏపీ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, ఏపీ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రామచంద్రయ్య, కెవివి ప్రసాద్ కోటేశ్వరమ్మ మృతి పట్ల సంతాపం తెలిపారు.