Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రయివేట్ భాగస్వామ్యం వల్ల గడ్డు రోజులు
- ప్రపంచ సరఫరా నెట్వర్క్లో కార్పొరేట్ సంస్థలదే ఆధిపత్యం
- 15 దేశాల్లో ఆక్స్ఫామ్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడి
నవతెలంగాణ, జనరల్డెస్క్
కనీస వేతనాలు, మెరుగైన పని పరిస్థితులను డిమాండ్ చేస్తూ కార్మిక-కర్షక సంఘాలు, ఐద్వా ఆధ్వర్యంలో ఇటీవల దేశ రాజధానిలో నిర్వహించిన ర్యాలీల్లో మహిళా రైతులు, వ్యవసాయ కార్మికులు అధికసంఖ్యలో పాల్గొనడం చూశాం. నయా ఉదార ఆర్థిక విధానాల్లో భాగంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు మహిళల జీవితాల్ని మరింత అధ్వాన్నస్థితికి నెట్టాయనడానికి అదో నిదర్శనం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గడంతో ఉద్యోగాలు,ఉపాధి కల్పన పడిపోయింది. దాంతో, ప్రయివేట్ వ్యాపార సంస్థలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోకి చొరబడ్డాయి.
నూతన పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించడం కోసం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(ఎన్ఆర్ఎల్ఎం)ను కేంద్రం ప్రారంభించింది. వ్యవసాయ, అటవీ(కలపేతర) ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లోకి తీసుకురావడం, అందుకు అవసరమైన నైపుణ్యాలను గ్రామీణ యువతలో పెంపొందిచడం ఈ మిషన్ ఉద్దేశంగా ప్రచారం చేశారు. వస్తు సరఫరా నెట్వర్క్ను విస్తరించడం ద్వారా అభివృద్ధి గొలుసులోకి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తీసుకురావాలన్నది లక్ష్యం. ఈ పథకానికి అనుబంధంగా మహిళా కిసాన్ సశక్తీకరణ్ మిషన్ను కూడా ప్రారంభించారు. ఈ స్కీంలోకి మహిళల స్వయం సహాయక బృందాలను తీసుకొని వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించాలనేది ప్రణాళిక. ఈ స్కీం కోసం రూ.2,875 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో మహిళా రైతుకు రూ.572 చొప్పున స్వయం సహాయక సంఘానికి రూ.5715 కేటాయించింది. అయితే,వ్యవసాయ రంగం, దాని అనుబంధ రంగాల ఉత్తత్తుల సరఫరా గొలుసులో ప్రయివేట్ సంస్థల ఆధిపత్యం తెలియంది కాదు. దాంతో, ప్రపంచ మార్కెట్లోకి చిన్న రైతులు, మహిళల్ని తేవడం వల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువ జరిగిందన్నది గమనార్హం. ఎన్ఆర్ఎల్ఎంను యూపీఏ హయాంలో 2011లో ప్రారంభించారు. అయితే, ఈ పథకం అమలులోనూ, లక్ష్యాల్ని సాధించే విషయంలోనూ వైఫల్యాలకు తావివ్వకుండా ఉండేందుకు ఇతర దేశాల్లో అమలైన ఇలాంటి పథకాల అనుభవాలను అధ్యయనం చేసి ఉండాల్సిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
చిన్న రైతులు..ప్రపంచ సరఫరా గొలుసు
వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ గొలుసులో కొన్ని బహుళజాతి కంపెనీలదే గుత్తాధిపత్యమని ఇటీవల(2018లో) ఆక్స్ఫామ్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాకు చెందిన 15 దేశాల్లో 15 వస్తు సరఫరా నెట్వర్క్ల్ని ఆక్స్ఫామ్ అధ్యయనం చేసింది. మొక్కజొన్న, గోధుమ, సోయా చిల్లర అమ్మకాల నిర్వహణలో నాలుగు కంపెనీలకే 70 శాతం వాటా ఉన్నట్టు తేలింది. ఆహార పదార్థాల రిటైల్ అమ్మకాల్లో 50 శాతం వాటా 10 సూపర్ మార్కెట్ సంస్థలదేనని స్పష ్టమైంది. సరఫరా నెట్వర్క్లో ప్రధాన భాగస్వాములైన చిన్న రైతులు తమ జోవనోపాధి కోసం బడా కంపెనీలపై ఆధార పడాల్సిన దుస్థితి ప్రపంచ మార్కెట్ వల్ల దాపురించింది. ఎగుమతుల ధరలు పడిపోగానే చిన్న రైతుల జీవితాలు చితికిపోయే దుస్థితి. ప్రపంచ మార్కెట్పై ఆధిపత్యమున్న ఈ కంపెనీలు వ్యూహాత్మకంగా రైతుల జీవితాలతో చెలగాటమాడిన సంఘటనలున్నాయి. 1980-2000 మధ్య బ్రెజిల్ నుంచి ఆరెంజ్ జ్యూస్, కెన్యా నుంచి గ్రీన్ బీన్స్ ఎగుమతుల ధరలు పడిపోవడంతో ఆ దేశాల రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన కార్పొరేట్ సంస్థలు, వినియోగదారులకు 45 నుంచి 48 శాతం అధిక ధరలకు అమ్మి లాభాల పంట పండించుకున్న సంఘటనలు 1996-2015 మధ్య కాలంలోనూ జరిగాయి. దీంతో, ప్రపంచ మార్కెట్ నెట్వర్క్లో చిన్న రైతుల భాగస్వామ్యం 8 శాతం నుంచి 6.5 శాతానికి పడిపోయింది. ఫలితంగా వ్యవసాయ రంగానికి దూరమైన రైతులు పాక్షిక కార్మికులుగా లేదా వ్యవసాయేతర రంగాల్లో శ్రామికులుగా మారారు.
మహిళలపై ప్రపంచ సరఫరా నెట్వర్క్ ప్రభావం
భారత్లోని తేయాకు పరిశ్రమలో, థాయిలాండ్లోని బియ్యం సరఫరా, కెన్యాలోని గ్రీన్ బీన్స్ సరఫరా నెట్వర్క్లో మహిళల భాగస్వామ్యం అధికంగా ఉన్నది. ఎగుమతుల ధరలు తగ్గినపుడు వీరి వేతనాలు సహజంగానే తగ్గాయి. చిన్న రైతులు తమ కుటుంబ అవసరాలరీత్యా మహిళలు, చిన్నారులచే వ్యవసాయ క్షేత్రాల్లో పని చేయించడం తెలిసిందే. అదంతా లెక్కింపునకురాని, వేతనాలులేని శ్రమే అవుతుంది. ఒక్కోసారి తమ జీవితాల్ని నిలిపి ఉంచుకోవడానికి అవసరమైన ఉపాధి కూడా దొరకని స్థితికి చిన్న రైతులు, మహిళలు నెట్టబడుతున్నారు. దక్షిణాఫ్రికాలోని ద్రాక్ష తోటల్లో పని చేసే మహిళల్లో కనీసం మూడోవంతు పస్తులతో గడిపినట్టు తెలిపారు. థాయిలాండ్లోని రొయ్యల సరఫరా నెట్వర్క్లో భాగస్వాములైన మహిళల్లో 54శాతంమంది తమ ఇండ్లలో సరిపడినంత ఆహారం ఉండేది కాదని తెలిపారు. ఫిలిప్పీన్స్లోని అరటి పరిశ్రమల్లో పని చేసే మహిళల్లో 72 శాతంమందిది అదే దుస్థితి.
సరఫరా చైన్లో భాగస్వాములైన మహిళల పరిస్థితి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ అధ్వాన్నంగానే ఉన్నది. ఇటలీలో పండ్లు, కూరగాయల పరిశ్రమలో పని చేసే మహిళలకు ఇచ్చే వేతనాలు పురుషులతో పోలిస్తే 30 శాతం తక్కువగా ఉన్నాయి. మరోవైపు తమతో ఎక్కువ పని చేయించేందుకు టార్గెట్లు నిర్నయిస్తున్నారని దక్షిణాఫ్రికా, థాయిలాండ్ మహిళలు తెలిపారు. దీంతో, మహిళల ఆరోగ్యం క్షీణిస్తున్న పరిస్థితి.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోకి ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యాన్ని తేవాలనుకునేముందు విధానకర్తలు ఈ అంశాల్ని చర్చించాలి. అసంఘటిత రంగంలోని శ్రామికులకు కనీస జీవితావసరాలకు సరిపడిన వేతనాలు కల్పించడం పట్ల ప్రయివేట్ సంస్థలు ఆసక్తి చూపవని ఈ అనుభవాల ద్వారా స్పష్టమవుతోంది. కార్పొరేట్ కంపెనీల దృష్టి అంతా అధిక లాభాలను ఎలా సాధించాలన్నదానిపైనే తప్ప తమ మార్కెట్ విస్తరణలో భాగస్వాములైన శ్రామికుల బాగోగుల పట్ల ఉండదనేది వాస్తవం.