Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు
భోపాల్: ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం కింద నిర్మించిన ఇండ్లపై ప్రధాని మోడీ, సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ల ఫోటోలతో ఉన్న టైల్స్ను వెంటనే తొలగించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం పథకం కింద ఇచ్చిన ఇండ్ల నిర్మాణాల్లో ఉపయోగించిన టైల్స్పై పీఎం, సీఎంల ఫోటోలు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సంజరు పురోహిత్ అనే దతియా వాసి గత జూలైలో పిటిషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ టైల్స్ కోసం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమేగాక, ఎన్నికలు ముందు వాటిద్వారా ప్రయోజనం పొందేందుకు చూస్తోందని పిటిషనర్ కౌన్సిల్ ఆరోపించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఇదివరకే ఉన్నత న్యాయాస్థానం నోటీసులు జారీ చేయగా దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇచ్చాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ తప్పును అంగీకరిస్తూ, ఆయా టైల్స్ను ఉపయోగించరాదంటూ అన్ని డివిజన్ల కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపింది. ఇండ్ల నిర్మాణంలో వాడిన టైల్స్ను మూడు నెలల్లో తొలగించాలని, తదుపరి విచారణలోగా దానిపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేస్తూ డిసెంబర్ 20కి వాయిదా వేసింది.