Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారణాసిలో ప్రాజెక్టులకు ప్రధాని మోడీ వాగ్ధానం
- హామీలు కోట్లలో.. నత్తనడకన నిధుల ఖర్చు
- ప్రకటిత ప్రాజెక్టులు సామాన్యులకు ప్రయోజనకరమైనవేనా?
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి తన నాలుగేండ్ల పాలనలో సొంత నియోజకవర్గమైన వారణాసికి భారీగా హామీలు ప్రకటించారు. అయితే ఈ భారీ ప్రకటనలకు తగినట్టుగా 'అభివృద్ధి' పనులకోసం ఖర్చులు లేకపోవడం గమనార్హం. ప్రధాని ప్రకటించిన హామీలు సైతం వారణాసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగానో, సామాన్య జనాలకు ప్రయోజనకరమైనవిగా లేకపోవడం స్థానికులను కలవరపరిచే అంశంగా పలువురు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా దేశానికి ప్రధాని అయిన మోడీ తన నియోజకవర్గ అభివృధ్ధి కోసం ఈ స్థాయిలో ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టడం సముచితం కాదని అనేకమంది భావిస్తున్నారు.
2014 నుంచి సొంత నియోజకవర్గానికి మోడీ 14 సార్లు పర్యటనలు చేశారు. వెళ్లిన ప్రతీసారి భారీ హామీలను ప్రకటించారు. ఇలా కాశీ(వారణాసి) ప్రజలకు మోడీ ఇచ్చిన హామీలను గురించి పరిశీలించగా ఆ 'అభివృద్ధి' పనుల విలువ 42,514 కోట్ల రూపాయలని తేలింది. అయితే ఈ మొత్తం ప్రకటనలకు సంబంధించినదే కాని అక్కడ ఖర్చు పెట్టిన గణాంకాలు కావు. నిధులు ఖర్చు నత్తనడకన సాగుతున్నాయి. 2014 ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రధాని ప్రకటించిన హామీల్లో కొన్ని ఇలా ఉన్నాయి.. మెట్రో, మోనో రైల్, ఆరు లేనుల రహదారులు, ఫ్లైఓవర్లు, రింగ్ రోడ్లు, శాటిలైట్ పట్టణాలు, విద్యుత్, బ్రాడ్బ్యాండ్ సేవలు, వ్యర్థపదార్థాల నిర్వహణ, భోజ్పూరి ఫిలిం సిటీ, బ్యాటరీ ఆపరేటెడ్ కార్లు, బహిరంగ ప్రదేశాల్లో సోలార్ లైట్లు, గంగా శుద్ధి. ఇవే కాకుండా వారణాసిని జపాన్లోని క్యోటో నగరంలా అభివృద్ధి చేస్తారని, మరికొన్నిసార్లు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత లండన్ నగరంలా తీర్చుదిద్దుతారని హామీనిచ్చారు. అయితే ఎన్నికల ప్రచారంలో మోడీ హామీలతో వారణాసి ప్రజలు ఉప్పొంగిపోయారో.. లేక ప్రధానమంత్రే తమ ఎంపీగా ఉంటే మరింత అభివృద్ధి చెందుతారని ఆశించారో తెలియదు గానీ.. మోడీ గెలిచారు. అప్పటి నుంచి ఒక దాని తర్వాత ఒకటిగా భారీ ప్రాజెక్టులు తెరమీదకు వచ్చాయి.
మోడీ తాజా పర్యటనలో వారణాసిలో జరిగిన అభివృద్ధి పనులను సమీక్షించారు. అందులో మోడీ ప్రధానంగా ఇరుకుగా ఉన్న నగర వీధుల్లో వేలాడుతున్న కేబుల్ వైర్ల గురించి ప్రస్తావించారు. ఈ వైర్లను చాలా వరకు తొలగించారని.. అండర్గ్రౌండ్ కేబుల్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అలాగే స్థానిక విమానాశ్రయంలో ప్రయాణికుల తాకిడి పెరిగిందని.. ఇది వారణాసి అభివృద్ధిని సూచిస్తున్నదని విశ్లేషించడం గమనార్హం.
ఈ నాలుగేండ్ల కాలంలో మోడీ ప్రారంభించిన ప్రాజెక్టుల్లో దేశీయ సంతతికి చెందిన గోవుల కోసం కన్సర్వేటివ్ సెంటర్లు, గంగా నదిలో వారణాసి, పాట్నాల నగరాలకు విహరించేందకు భారీ క్రూయిజ్ ఏర్పాట్లు ఉన్నాయి.
ఇందులో ఇద్దరికి టికెట్ ఖరీదు రూ. 90వేలు ఉంటుంది. గంగానదీ ప్రక్షాళనకు రు.21వేల కోట్లను కేటాయిస్తున్నట్లు మోడీ ప్రకటించారు. అందులో 600 కోట్లను వారణాసి కోసం ప్రత్యేకంగా కేటాయించారు. దానికి సన్నాహాలు మాత్రమే జరిగాయి, కానీ ఇంకా కాలుష్యంతో గంగా కునారిల్లుతునే వుంది. కాగా, వారణాసికి లబ్ధి చేకూరేలా పలు మంత్రిత్వ శాఖలు దాదాపు 8వేల అభివృద్ధి పనులను ప్రకటించాయి. అయితే కొద్దిమేరకు జరుగుతున్న రోడ్ల పనులతో, పెద్ద పెద్ద హోర్డింగులతో, బడా కార్లలో కాంట్రాక్టర్లు తిరుగుతున్న హడావిడి మాత్రమే అక్కడ కనిపిస్తున్నది. గతేడాది కూలిన ఫ్లైఓవర్ అక్కడి పనివిధానాలను వివరిస్తోంది.
పరిశ్రమల్లేని అత్యధిక జనసాంధ్రత గల నగరంలో, మెదడుకు సంబంధించిన వ్యాధులతో అధిక మంది చిన్నారులు మరణిస్తున్న ఈ నగరంలో పైన ప్రకటించిన అభివృద్ధి పనులు ఏ మేరకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయోనని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.