Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుతానికంటే 65 శాతం అధికం
గాంధీనగర్: ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుంటే ఒక్క పైసా తగ్గించని బీజేపీ సర్కారు గుజరాత్లో మాత్రం ఎమ్మెల్యేలకు భారీగా జీతాలు పెంచింది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడుతున్నా.. నిత్యావసరాల ధరలు పెరిగి రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టసభ్యులకు మాత్రం ఎడాపెడా వేతనాలు పెంచేసింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి.
తాజా బిల్లు ప్రకారం.. గుజరాత్లో ఎమ్మెల్యేలకు ప్రతీ నెలా రూ. 1 లక్షా 16వేల 316 చెల్లించనున్నారు. ప్రస్తుతం వారికి రూ. 70,727లు అందుతోంది. దీనితో పోల్చితే దాదాపు 65 శాతం వేతనం పెరిగింది. ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు, సభాపతి,
ఉపసభాపతి, ప్రతిపక్ష నాయకుల వేతనాలు కూడా భారీగానే పెరిగాయి. రూ. 80 వేలుగా ఉన్న వీరికి నెలకు రూ. 1 లక్షా 32 వేలు (దాదాపు 54 శాతం పైకి) ముట్టనున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలకు మరింత అందుబాటులోకి ఉండటానికే ఈ పెంపును చేపట్టామని బిల్లును ప్రవేశపెట్టిన రాష్ట్ర హోంమంత్రి ప్రదీప్ సిన్హా జడేజా తెలిపారు. దీనిపై గుజరాత్ దళిత ఎమ్మెల్యే జిగేశ్ మేవానీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ఉద్యోగాలుగా మార్చాలని కోరారు. 182 మంది సభ్యులున్న అసెంబ్లీలో.. తాజా పెంపుతో రాష్ట్ర ఖజానా నుంచి ఏటా రూ. 10 కోట్లు అదనంగా ఖర్చు కానుంది. పెరిగిన జీతాలను 2017 డిసెంబర్ నుంచి చెల్లించనున్నారు.