Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దశాబ్దకాలంలో దయనీయమైన బతుకులు
- నాలుగేండ్ల మోడీపాలనలోనూ అంతులేని ఘోరాలెన్నో!
న్యూఢిల్లీ : 2001-11 మధ్య కాలంలో దళిత రైతుల సంఖ్య గణనీయంగా తగ్గిందని అధికారిక లెక్కలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ కాలంలో అధిక శాతం మంది దళితులు వ్యవసాయం వదిలి వ్యవసాయ కూలీలుగా మారిపోయారని, అలాగే నిర్మాణ రంగం, హౌటళ్లు, రెస్టారెంట్లలో పని చేస్తున్న వారి సంఖ్య కూడా అసాధారణంగా పెరిగిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన వివరాలు వెల్లడిస్తున్నాయి. 'మెయిన్ వర్కర్స్' పేరిట సంవత్సరంలో ఆర్నెల్లకు పైగా పని లభించిన వారి వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. 2011లో దళితుల్లో సగం మంది వ్యవసాయ కూలీలుగానో, నిర్మాణ కార్మికులుగానో పనిచేస్తున్నట్టు వెల్లడించింది. 2001 తరువాతి కాలంలో దళిత వ్యవసాయ కార్మికుల సంఖ్య 22 శాతం మేర పెరుగుదల నమోదుచేసుకోవటం ఆసక్తికరమైన అంశం. అదే సమయంలో దళిత రైతుల సంఖ్య 12 శాతం మేర పడిపోయింది. దళితుల్లో అధికశాతం మంది తమ వ్యవసాయ భూములును విక్రయించుకుని ఇతర రంగాలలో పనులుచేసుకుంటున్నారని ఈ లెక్కల ద్వారా తెలుస్తోంది. 2001-11 మధ్య కాలంలో నిర్మాణ రంగంలో పనులకు కుదురుకున్న దళిత కార్మికుల సంఖ్య 79 శాతం మేర పెరిగింది. అదే విధంగా ఆతిథ్యం, ఆహారసేవల రంగంలో కూడా దళిత కార్మికుల సంఖ్య 90 శాతం మేర పెరిగింది. వ్యవసాయ రంగంలో ఆదాయం కన్నా పెట్టుబడులు పెరిగి పోతుండటంతో అనేక మంది రైతులు తమ భూములను అమ్ముకుంటున్నారని, చిన్న కమతాలున్న దళిత రైతులు కూడా తమ భూములను అమ్ముకుని పట్టణ ప్రాంతాలకు వలస బాట పడుతున్నారని ఈ లెక్కలు చెబుతున్నాయి.
భూమిలేని అనేక మంది దళితులు వ్యవసాయ కూలీలుగా మారిపోతున్నారని, గత కొన్ని దశాబ్దాలుగా ఇది కూడా వారి జీవితాలను ఏ మాత్రం మార్చటం లేదని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ చైర్మెన్ మిళింద్ కాంబ్లే చెబుతున్నారు. నిర్మాణ రంగంలో దళిత కార్మికుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన పలువురు దళితులు తమను తాము సబ్ కాంట్రాక్టర్లు, కాంట్రాక్టర్లుగా ప్రమోట్ చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. తాను కూడా అదే విధంగా బీఈ పూర్తి చేసుకుని సబ్ కాంట్రాక్టర్గా ఈ రంగంలో అడుగు పెట్టి కాంట్రాక్టర్గా మారానని ఆయన వివరించారు.
గ్రామాల నుంచి పట్టణాలకు వలస వస్తున్న దళితులు మాత్రం నిర్మాణ రంగ కూలీలుగానే మిగిలిపోతున్నారన్నారు. దశాబ్దకాలం గురించి నివేదిక వెల్లడిస్తే.. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దళితులపై అంతులేని ఘోరాలు జరుగుతున్నాయన్న వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మోడీ సర్కార్ వచ్చాక ఈ నాలుగేండ్లలో..పెత్తందార్ల దాడులు..ఇతర అరాచకాలతో దళితుల బతుకులు మరింత దయనీయంగా మారాయని దళితసంఘాల నేతలు అంటున్నారు.