Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరలు పెరుగుతున్నాకొద్దీ చమురు శుద్ధి కంపెనీలకు లాభాల పంట
- 2017-18లో ఇండియన్ ఆయిల్కు రూ.33,612 కోట్లు..!
- రిలయన్స్ ఇండిస్టీస్కు రూ.21,346 కోట్లు..!!
- పన్నుల రూపంలో కేంద్రానికి రూ.3 లక్షలకోట్లకుపైనే..!!!
- 2014-16 మధ్య 9 సార్లు ఎక్సైజ్ డ్యూటీ పెంచిన కేంద్రం..
ఓవైపు డీజిల్, పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రతిరోజూ పెరుగుతున్న ఈ ధరల్ని అదుపుచేసేదెవరు అంటూ లోలోన కుమిలిపోతున్నారు. అయితే ఎడాపెడా వాయిస్తున్న ధరలతో ఎవరు కోట్లు వెనకేసుకుంటున్నారు. ప్రయివేట్ చమురు శుద్ధి కంపెనీలతోపాటు కేంద్ర ప్రభుత్వమూ ఏవిధంగా జనం జీవితాలతో చెలగాటమాడుతున్నది. ఇంతకీ ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఎలా దండుకున్నారు..? అసలు ఈ ఇంధనధరల బాదుడు వ్యవహారం ఎలా సాగుతున్నదో తెలిస్తే..సగటు జీవి కూడా షాకవ్వాల్సిందే..
న్యూఢిల్లీ: పెట్రోధరలు విపరీతంగా పెరిగిపో తుంటే..మోడీ క్యాబినెట్ నోరువిప్పదు. మా చేతుల్లో ఏంలేదని అంటూనే పరోక్షంగా కార్పొరేట్లకు సహకరిస్తున్నదనటానికి తాజా ఉదాహరణ ఇది. పన్నుల రూపంలో కోట్లు దండుకోవటంతో పాటు రిలయన్స్ ఇండిస్టీస్కు వేల కోట్ల మేర లాభాలు ఆర్జించేలా సహకరిస్తున్నది బీజేపీ సర్కార్. కాగా దేశంలోని కొన్ని నగరాల్లో పెట్రోల్ ధర లీటర్కు రూ.90 దాటింది. ఏడాది కాలంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, అంతకన్నా అధికంగానే కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో లాగేసుకుంటోంది. దీనికితోడు ఇటీవల డాలర్తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పడిపోవడంతో ఆ భారాన్నీ పౌరులపైనే కేంద్ర ప్రభుత్వం మోపుతోంది. వాస్తవానికి మన దేశంలోకి దిగుమతి చేసుకుంటున్నది శుద్ధి చేసిన పెట్రోల్, డీజిల్ కాదన్నది గమనార్హం. దిగుమతి చేసుకుంటున్నది ముడి చమురు మాత్రమే. పలు రకాల పన్నులతో కలిపి వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నది మాత్రం పెట్రోల్, డీజిల్ను దిగుమతి చేసుకుంటే ఎంత ఖర్చవుతుందో అంతకన్నా ఎక్కువే కావడం గమనార్హం.
దేశంలోని ప్రభుత్వ, ప్రయివేట్ చమురు శుద్ధి కర్మాగారాలకు రిఫైనరీ గేట్ ప్రైస్(ఆర్జీపీ) పేరుతో చెల్లిస్తున్నది వాణిజ్య సమానత్వ ధర(టీపీపీ). దిగుమతి సమానత్వ ధర(ఐపీపీ), ఎగుమతి సమానత్వ ధర(ఈపీపీ)ల సగటును టీపీపీగా లెక్కిస్తారు. ఐపీపీ అంటే ఒక ఉత్పత్తిని ఓడరేవుల ద్వారా దిగుమతి చేసుకుంటే అయ్యే ఖర్చు. కేవలం అది చమురు ధర మాత్రమే కాదు. దానికి అదనంగా దిగుమతి ఖర్చులు, బీమా, కస్టమ్స్ సుంకాలు, ఓడరేవుకు చెల్లించే కిరాయి..ఇవన్నీ కలిపి ఐపీపీగా లెక్కిస్తారు. ఈపీపీ అంటే ఒక ఉత్పత్తిని ఎగుమతి చేస్తే ఎగుమతిదారుకు ఎంత లభిస్తుందో ఆ ధర అని అర్థం. కస్టమ్స్ సుంకాలు స్థిరంగా ఉండవన్నది గమనార్హం. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాకొద్దీ కస్టమ్స్ సుంకాలు పెరుగుతాయి. ఉదాహరణకు ఒక బ్యారెల్ ధర 100 డాలర్లుగా ఉన్నపుడు కస్టమ్స్ సుంకం 2.5 డాలర్లుంటుంది. బ్యారెల్ ధర 200 డాలర్లకు పెరిగితే సుంకం 5 డాలర్లవుతుంది. 2015-16, 2017-18 మధ్య ముడి చమురు ధర బ్యారెల్కు సగటున 46 డాలర్ల నుంచి 48 డాలర్లుగా ఉన్నది. ఆ తర్వాత 56 డాలర్లకు పెరిగింది. అయితే, చమురు శుద్ధి చేసే ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్, ప్రయివేట్ సంస్థ రిలయన్స్ ఇండిస్టీస్ ఈ కాలంలో లాభాలు ఎలా గడించాయో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
ఇండియన్ ఆయిల్ 2015-16లో రూ.27,426 కోట్లు, 2016-17లో రూ.31,425 కోట్లు, 2017-18లో రూ.33,612 కోట్లు గడించింది. రిలయన్స్ ఇండిస్టీస్ 2015-16లో రూ.11,242 కోట్లు, 2016-17లో రూ.19,106 కోట్లు, 2017-18లో రూ.21,346 కోట్లు గడించింది. దిగుమతి చేసుకున్న ముడి చమురు విలువకూ ఎగుమతి చేసిన పెట్రోల్, డీజిల్ విలువకూ మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో ఈ కంపెనీలు ఎగుమతుల ద్వారా కూడా భారీగా దండుకుంటున్నట్టు అర్థమవుతోంది. 2017-18లో పెట్రోల్,డీజిల్ దిగుమతుల విలువ 74 కోట్ల 40 లక్షల డాలర్లు కాగా, ఎగుమతుల విలువ 2385 కోట్ల 80 లక్షల డాలర్లు.
మరోవైపు ఎక్సైజ్ సుంకం రూపంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ వినియోగదారుల నుంచి వేలకోట్లు దండుకుంటోంది. 2014 నవంబర్ నుంచి 2016 జనవరి వరకు ఎక్సైజ్ సుంకాన్ని 9సార్లు పెంచింది. 2017 అక్టోబర్లో ఒక్కసారి మాత్రమే తగ్గించింది. 2015లో లీటర్ డీజిల్పై రూ.2.96 ఉన్న ఎక్సైజ్ సుంకం 2016 జనవరికి రూ.11.33కు పెరిగింది. ఇదే కాలంలో పెట్రోల్పై రూ.2.70 నుంచి రూ.9.48కి పెరిగింది. దీనికి అదనపు పన్నులు(జాతీయ విపత్తు,రవాణా సౌకర్యాల సెస్,వగైరా) రూ.8 వరకూ కలిపి పెట్రోల్పై రూ.17, డీజిల్పై రూ.19 అదనంగా వసూలు చేస్తున్నది. 2017-18లో కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్పై సమకూరిన ఆదాయం కస్టమ్స్ సుంకాల కింద రూ.11,966 కోట్లు, ఎక్సైజ్ సుంకం కింద రూ.2,51,805 కోట్లు. లాభాలపై పన్ను రూపంలో రూ.33,021 కోట్లు, డివిడెండ్ రూపంలో రూ.14,575 కోట్లు, డివిడెండ్ పంపిణీపై పన్ను కింద రూ.5,981 కోట్లు..
వినియోగదారులపై కేంద్రం విధించే పన్నులకు తోడు రాష్ట్రాలు విధించే ఎంట్రీ ట్యాక్స్, విలువ ఆధారిత పన్ను అదనంగా పడుతుంది. దీంతో, జీఎస్టీలోని తక్కువ పన్నుల శ్లాబులో పెట్రోల్, డీజిల్ను చేర్చాలన్న డిమాండ్ ముందుకు వస్తోంది.