Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండోనేషియా జూడో క్రీడాకారిణికి చేదు అనుభవం
జకార్తా : అత్యంత ప్రతిష్టాత్మక ఈవెంట్ 'ఆసియా పారా' క్రీడల్లో నియమనిబంధనల పట్ల సరైన అవగాహన లేకపోవటం క్రీడాకారుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. 'హిజాబ్' ధరించి ఇండోనేషియా జూడూకో క్రీడాకారిణి మిఫ్తాహుల్ జన్నా పాల్గొనటంతో ఆమెను పోటీకి అనుమతించలేదు. ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ (ఐజేఎఫ్) నిబంధనల ప్రకారం జూడో క్రీడాకారులు ముఖాన్ని కప్పివుంచే ఎలాంటి వస్త్రధారణ చేయరాదు. సోమవారంనాటి పోటీకి సంబంధించి మిఫ్తాహుల్ జన్నా హిజాబ్ తీసేయడానికి నిరాకరించటం, ఆమెను పోటీలో లేకుండా చేసింది.
ఈనేపథ్యంలో...నేషనల్ పారా ఒలింపిక్స్ కమిటీ, ఇండోనేషియన్ ఏసియన్ పారా క్రీడల ఆర్గనైజేషన్ కమిటీ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, నియమనిబంధనల పట్ల క్రీడాకారులకు సరైన అవగాహన కల్పించలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తాయి.
కరాటే, తైంక్వాండో లాంటి ఇతర మార్షల్ ఆర్ట్స్కు సంబంధించిన క్రీడల్లో ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడానికి నిబంధనలు అనుమతిస్తున్నాయి. కానీ జూడోలో మహిళా అథ్లెట్స్ హిజాబ్ ధరించరాదు. దీనికి సంబంధించి క్రీడాకారిణి మిఫ్తాహుల్ జన్నా కోచ్ అహ్మద్ బాహర్ మాట్లాడుతూ...''జూడో క్రీడా నియమనిబంధనలపై నాకు అవగాహన ఉంది. అయితే హిజాబ్ ధరించడానికి అనుమతించాలని నేను క్రీడా నిర్వాహకుల వద్ద ప్రయత్నించాను. ఈ పోటీని నిర్వహిస్తున్న 'ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్' నా విన్నపాన్ని తిరస్కరించింది'' అని చెప్పారు. ఏదేమైనప్పటికీ జూడో ఫెడరేషన్ నిబంధనల్ని తాము గౌరవిస్తున్నామని, భవిష్యత్తులో తమ ఆకాంక్షను మన్నిస్తారన్న నమ్మకం తమకుందని ఆయన చెప్పారు.
అయితే ఈ ఘటనపై ఇండోనేషియా క్రీడల మంత్రి ఇమామ్ నార్వాయి స్పందించారు. ముస్లిం మహిళలు హిజాబ్ ధరించటంపై ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్తో మాట్లాడుతామని ఆయన చెప్పారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.