Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడువారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు
న్యూఢిల్లీ : వృద్ధాప్య పింఛన్ల అమలుతీరుపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న 'నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రాం' చూడటానికి బాగనే ఉన్నా, క్షేత్రస్థాయిలో అమలుతీరు అలా కనబడటం లేదని జస్టిస్ మదన్ బి.లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. వృద్ధాప్య పింఛన్ల అమలు కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని, లోపం ఎక్కడుందో అప్పుడే బయటపడుతుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అడిషినల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్, ఎన్ఎస్ఏపీ కార్యక్రమాన్ని కోర్టు ముందు ప్రస్తావించారు.
వృద్ధాప్య పింఛన్ల అమలుతీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ కేంద్రమంత్రి అశ్విన్ కుమార్ ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, వృద్ధుల జనాభా 10.38కోట్లకు చేరుకుందని పిల్లో పేర్కొన్నారు. ఆరు నెలలు ఆపుతూ.. నెలకు రూ.200 పింఛన్ ఇస్తున్నారని, కనీసం రూ.3వేలు అందజేయాలని ఆయన పిల్లో కోరారు.
విచారణ సందర్భంగా ధర్మాసనం, 'ఎన్ఎస్ఏపీ' పథకానికి ఇంఛార్జ్ ఎవరని, పథకాల అమలు బాధ్యత ఎవరు తీసుకున్నారని అడిషనల్ సొలిసిటర్ జనరల్ను ప్రశ్నించింది. ఎన్ఎస్ఏపీ కార్యక్రమంలోని పథకాలన్నీ బాగానే ఉన్నాయి కానీ, అమలు తీరులో ఎంతో తేడా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై మూడువారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఫిర్యాదుల స్వీకరణ యంత్రాంగం ఉందా?సోషల్ ఆడిటింగ్ జరుగుతోందా?అని ఏఎస్జీని ప్రశ్నించింది.
ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకం, ఇందిరాగాంధీ జాతీయ వితంతు పింఛన్ పథకం, ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పథకం, జాతీయ కుటుంబ పథకం, అన్నపూర్ణ పథకం....అన్నింటీనీ 'ఎన్ఎస్ఏపీ' కార్యక్రమంలో భాగంగా కేంద్రం అమలుజేస్తున్న విషయాన్ని పింకీ ఆనంద్ కోర్టుకు తెలియజేశారు. ఇందుకోసం 2018-19లో 9,975కోట్లు కేటాయించారని, మూడుకోట్లమందికి వృద్ధాప్య పింఛన్లు అందిస్తున్నామని ఆమె చెప్పారు.