Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్షణ శాఖ నిబంధనలు మార్చిన ఏకైక ప్రధాని మోడీయే..
- వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహులుగా ముద్ర : కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా మరోసారి మోడీ సర్కారుపై విరుచుకుపడ్డారు. డాలరు తో పోలిస్తే రూపాయి విలువ అంతకంతకూ క్షీణించడం పట్ల స్పందిస్తూ.. రూపాయి కోమా లో ఉన్నదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి విలువ రూ. 60 ఉంటేనే భారతీయ రూపాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉందని వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. కానీ, మోడీ పాలనలో అమెరికన్ డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ. 75కు చేరుకుందని, అయినా మోడీ మాత్రం దీనిపై స్పందిచండం లేదన్నారు. దేశంలో పరిస్థి తులు ఆందోళనకరంగా ఉన్నాయని.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారందరిపై దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హెచ్చరించారు.
రాఫెల్ అతి పెద్ద కుంభకోణమని, దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేసి నెల రోజులు గడుస్తున్నా స్పందన లేదని అన్నారు. తమ అనుయాయుల కోసం దేశంలో రక్షణ శాఖ నిబంధనలను మార్చిన ఏకైక ప్రధాని మోడీయేనని ఆరోపించారు. దేశ చరిత్రలో ఇంతటి హేయమైన ఒప్పందం ఏదీ జరుగలేదని, సీబీఐ విచారణ చేపడితే చాలా మంది పేర్లు బయిటికొస్తాయని తెలిపారు. దేశంలో ఆర్థిక నేరగాళ్లు మునుపెన్నడూ లేని విధంగా బ్యాంకులను కొల్లగొట్టి దేశం విడిచి పారిపోతున్నా ప్రభుత్వం మాత్రం వారిని నియరత్రించడానికి ఏ విధమైన చర్యలూ తీసుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ.. సొంతపార్టీకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని అందరూ తనను అడుగుతున్నారని కానీ, పార్టీ కంటే దేశం ముఖ్యమని అన్నారు. బీజేపీలో ప్రజాస్వామ్యం లేదని, నిరంకుశత్వం పెరిగిపోయిందని విమర్శించారు. ఇద్దరు వ్యక్తుల చేతుల్లో పార్టీ బందీ అయ్యిందని పరోక్షంగా అమిత్ షా, మోడీలను ఉద్దేశించి మాట్లాడారు.