Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డస్సాల్ట్ కంపెనీకి మోడీ సర్కార్ తప్పనిసరి నిబంధన
- స్వేచ్ఛగా ఎంపికచేసుకునే ఆప్షన్ ఇవ్వలేదు
- కీలక పత్రాల్ని ఉటంకిస్తూ 'మీడియాపార్ట్' మరో కథనం
పారిస్ : ఫ్రాన్స్ ఇన్వెస్టిగేటివ్ జర్నల్ 'మీడియాపార్ట్' రాఫెల్ ఒప్పందంపై మరో బాంబులాంటి వార్త పేల్చింది. 'ఆఫ్సెట్' భాగస్వామిగా అనిల్ అంబానీ సంస్థ 'రిలయెన్స్ డిఫెన్స్'ను మాత్రమే ఎంచుకోవాలని మోడీ సర్కార్ కచ్చితమైన నిబంధన డస్సాల్ట్ ముందు పెట్టిందన్న కథనం తాము గతంలో వెలువరించామని, అది వాస్తవమని నిరూపించే 'డస్సాల్ట్ కంపెనీ' పత్రాలు ఇవేనంటూ 'మీడియాపార్ట్' బుధవారం రాత్రి ఒక సంచలన కథనం విడుదల చేసింది.
ఆ కీలక పత్రాల్లో ఏముందంటే, డస్సాల్ట్ కంపెనీ ఉన్నతాధికారి లోయిక్ సీగాలెన్ తన సిబ్బందికి భారత్తో కుదిరిన రాఫెల్ ఒప్పందం గురించి వివరించారు. 59వేల కోట్ల విలువైన ఈ యుద్ధ విమానాల ఒప్పందం భారత్తో కుదరాలంటే, ఆఫ్సెట్ భాగస్వామిగా 'రిలయెన్స్ ఢిఫెన్స్'ను ఎంచుకోవాలన్న కచ్చితమైన నిబంధన మోడీ సర్కార్ నుంచి వచ్చిందని ఆయన వారితో (మే 11, 2017న) చెప్పారు.
నెలరోజుల క్రితం 'మీడియాపార్ట్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే కూడా ఇదే విషయాన్ని బయటపెట్టాడు. మోడీ సర్కార్ కచ్చితంగా కోరింది కాబట్టే రాఫెల్ డీల్లోకి 'అనిల్ అంబానీ సంస్థ' వచ్చి చేరిందని అన్నారు. ఆయన వ్యాఖ్యలు భారత్లో రాజకీయంగా తీవ్ర సంచలనం రేపింది. హోలాండే వ్యాఖ్యల్ని ఖండిస్తూ, డస్సాల్ట్, ఫ్రాన్స్ ప్రభుత్వం, ఇక్కడి మోడీ సర్కార్ వస్తోంది. భారత్లో హెచ్ఏఎల్ను కాదని, రిలయెన్స్ డిఫెన్స్ను ఎంచుకోవటం అంతా పారదదర్శకంగా జరిగిందని, ఇందులో ఎవరి ఒత్తిడీ లేదని డస్సాల్ట్, మోడీ సర్కార్, మన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతూ వస్తున్నారు. అయితే వీరి మాటలన్నీ ఒట్టి అబద్ధాలేనని తేలుస్తూ 'మీడియాపార్ట్' తాజా వార్తా కథనం వెలువడింది.
ఆరోపణలు, ప్రత్యారోపణలు, మీడియా కథనాలు భారత రాజకీయాల్ని వేడెక్కిస్తుండగా, మూడు రోజుల పర్యటన నిమిత్తమై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ బయల్దేరి వెళ్లారు. అక్కడ ఆమె డస్సాల్ట్ కంపెనీని సందర్శించనున్నారు. ఈ డీల్ గుట్టు రట్టు కాకుండా చూడటానికి కేంద్రమంత్రి అక్కడకు వెళ్లారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.