Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ వ్యతిరేక పోస్టులకు చెక్ పెడుతున్న 'ఫేస్బుక్'
- గత పక్షం రోజుల్లో.. పదుల సంఖ్యలో సీనియర్ ఎడిటర్ల అకౌంట్లు డిసేబుల్
- మైనార్టీలపై పెరుగుతోన్న దాడులు, మహిళలపై అరాచకాలను ప్రశ్నించడమే కారణం
- అధికార పార్టీ ఆదేశాలానుసారమే 'ఫేస్బుక్' చర్యలు: సామాజిక కార్యకర్తలు, నెటిజన్లు
- 'సోషల్ మీడియా కమ్యూనికేషన్స్ హబ్' పేరుతో పౌరస్వేచ్ఛను హరించేలా బీజేపీ .. తప్పుబట్టిన సుప్రీం
* జై
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా చెప్పబడే మీడియా రంగం నేడు కార్పొరేట్ కబంధ హస్తాల్లో నలిగి పోతున్నదన్నది వాస్తవం. ఈ విషయాన్ని నిరూపిస్తూ.. ఇప్పటికే, ఎన్నో దృ ష్టాంతాలు వెలుగుచూశాయి. ఇక, మీడియా స్వేచ్ఛపై కొన్ని రాజకీయ పార్టీల మూకుమ్మడి దాడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నాలుగున్నరేండ్ల కాలంలో కాషాయదళం చేసిన అభివృద్ధి ఏంటో ఇప్పుడిప్పుడే ప్రజానీకానికి అర్ధమవుతున్నది. బీజేపీ హయాంలో మహిళలపై, మైనార్టీలపై ఎన్నడూ లేని విధంగా జరుగుతున్న దాడులు, అట్టడగు వర్గాల వారి ఆవేదన, ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలు వగైరా అంశాలపై ప్రశ్నిస్తూ.. మోడీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్న పాత్రికేయుల గొంతుకను నొక్కే ప్రయత్నాలకు పాలకులు తాజాగా పూనుకోవడం గమనార్హం.
అకౌంట్లు డిసేబుల్
రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు తమ వంతు కృషి అందిస్తామని ఇటీవలే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పేర్కొంది. ఐతే, ''చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది..'' అన్నట్టు తయారైంది ఫేస్బుక్ వాలకం. ఎలాంటి హెచ్చరికలు/నోటీసులు లేకుండా.. ప్రఖ్యాత మీడియా సంస్థల్లో పనిచేస్తోన్న సీనియర్ ఎడిటర్ల అకౌంట్లను ఫేస్బుక్ గత పక్షం రోజులుగా డిసేబుల్ చేస్తుండటం కలకలం రేపుతోంది. ఫేస్బుక్ బాధితుల్లో దైనిక్ భాస్కర్ న్యూస్, జంజ్వార్.కామ్, జనతాకారిపోర్టర్.కామ్ ఎడిటర్లు, బీబీసీ, ఖలీజ్ టైమ్స్ మాజీ ఎడిటర్లతో పాటూ మరికొందరు సీనియర్ జర్నలిస్టులు కూడా ఉండటం గమనార్హం. మరి ఫేస్బుక్ వీరి అకౌంట్లనే, ఇప్పుడే.. ఎందుకు డిసేబుల్ చేస్తుందో తెలుసా? ఫేస్బుక్ ప్రస్తుతం డిసేబుల్ చేసిన ప్రముఖుల్లో పెక్కు మంది.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలలోని లోపాలను డిజిటల్ మీడియా/ సామాజిక మాధ్యమ వేదికల్లో గత కొంతకాలంగా వ్యాసాల రూపంలో పోస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మైనార్టీలపై దాడులు, మహిళలపై అరాచకాలు, బలహీన, సామాన్యుల సమస్యలను పట్టించుకోకుండా బడాబాబులకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తోన్న ఆయా పోస్టులు ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో కాషాయదళానికి కషాయంలా తయారయ్యాయి. ఇది ఇలాగే కొనసాగితే, అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశమున్నదన్న కారణంతో.. ఆయా జర్నలిస్టుల అకౌంట్లనే ఫేస్బుక్ టార్గెట్ చేసినట్టు వినికిడి. అధికారపార్టీ నేతలే ఫేస్బుక్చే ఈ పనులు చేయిస్తున్నారని, ఇది మంచి పరిణామం అనిపించుకోదని.. దేశీయ అంతర్గత రాజకీయాల్లో ఫేస్బుక్ జోక్యం మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాషాయమే ఎజెండీ
2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కీరోల్ ప్లే చేసిన సోషల్ మీడియాను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి 'సోషల్ మీడియా కమ్యూనికేషన్స్ హబ్' పేరుతో బీజేపీ సర్కారు కొత్త నాటకానికి తెరతీస్తూ.. సోషల్ మీడియా, ఈ-మెయిల్స్లోని సమస్త సమాచారంపై నిఘా పెట్టేందుకు కావాల్సిన సాఫ్ట్వేర్ కోసం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ)ను జారీచేయడం తెలిసిందే! దీనిపై దేశవ్యాప్తంగా నెటిజన్ల నుంచీ, సామాజిక కార్యకర్తల నుంచీ తీవ్ర విమర్శలు వెల్లువెత్తడమే గాకుండా.. సాక్షాత్తూ సుప్రీంకోర్టు సైతం ''దేశంలో నిఘా రాజ్యాన్ని స్థాపిస్తారా?'' అని ఘాటుగా ప్రశ్నించడం.. నీళ్ళు నములుతూ 'హబ్' ఏర్పాటు ప్రతిపాదనను కేంద్రం విరమించుకుంటున్నట్టు ప్రకటించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే, తన పోకడను మార్చుకోని కాషాయదళం.. వివిధ సామాజిక మాధ్యమాలతో 'లోగుట్టు ఒప్పందాలు' చేసుకొని.. మీడియా, పౌర స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నదని సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, మతం, కులం, జాతి, రంగు ఆధారంగా రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా చేసే విద్వేష ప్రసంగాలు, అప్లోడ్ చేసే హింసాత్మక వీడియోలను తొలగిస్తామని గొప్పగా ప్రకటించిన 'ఫేస్బుక్' ఆయా చర్యలకు తిలోదకాలు పెడుతూ.. 'కాషాయం' పబ్లిసిటీకి కార్యాచరణ రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను చూస్తే, ఇది నిజమేనన్న అభిప్రాయం సామాన్యుడిలోనూ కలుగుతున్నది.