- తెనాలిలో మహిళలపై లాఠీఛార్జ్ - 'పశ్చిమ'లో ఆరుగురికి గాయాలు - పలుచోట్ల మున్సిపల్ కార్మికుల అరెస్టు విజయవాడ: 279 జిఒను రద్దు చేయాలని, న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు చేస్తోన్న సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతిఘటిస్తూ కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మహిళలపై పోలీసుల పిడిగుద్దులను తట్టుకోలేని ఓ కార్మికురాలు అస్వస్థతకు గురైంది. పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఆరుగురికి గాయాలయ్యాయి. అయినా వెనకడుగు వేయని మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు రాత్రింబవళ్లు గస్తీ తిరుగుతున్నారు. 8వ రోజైన గురువారం పలుజిల్లాల్లో వంటావార్పులు, ధర్నాలు, ర్యాలీలు రాస్తారోకోలు, నిర్వహించి రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో గురువారం ఉదయం చంద్రబాబునాయుడు కాలనీలో పోటీ కార్మికులను అడ్డుకున్నారు. అక్కడికి చేరుకున్న కమిషనర్ కార్మికులను మందలించడంతో పక్కనే ఉన్న పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురు మహిళలను జీపు ఎక్కిస్తుండంతో వారు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో జయలక్ష్మి అనే కార్మికురాలిని మహిళా కానిస్టేబుల్స్ జుట్టుపట్టుకుని జీపులోకి ఈడ్చి వేయటంతో ఆమె తీవ్ర అస్వస్థతకు లోనైంది. మరో ఇద్దరు కార్మికులు పద్మ, శివలక్ష్మి పైనా మహిళా కానిస్టేబుల్స్ పిడిగుద్దులు కురిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అస్వస్థతకు గురైన జయలక్ష్మిని తోటి కార్మికులు స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇదిలా ఉండగా మరో 16 మందిని అరెస్ట్ చేశారు. రేపల్లెలోనూ పోలీసు సిబ్బంది సైతం భారీగా మోహరించారు. అయినా కార్మికులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సత్తెనపల్లిలో పోటీ కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులు అడ్డుకున్నారు. చెత్త ట్రాక్టర్ను వెళ్లనివ్వకుండా రోడ్డుపై బైఠాయించడంతో అక్కడున్న 30 మందిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. తాడేపల్లిలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడారు. ఇతర ప్రాంతాల్లోనూ విభిన్న రూపాల్లో నిరసనలు కొనసాగాయి. కృష్ణా జిల్లా గుడివాడలో మున్సిపల్ కార్మికులు బిక్షాటన చేశారు. తిరువూరులో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. తెనాలిలో మున్సిపల్ కార్మికుల లాఠీఛార్జీలకు నిరసనగా నందిగామ గాంధీ సెంటరులోనూ, జగ్గయ్యపేటలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ధర్నాలు నిర్వహించారు. మచిలీపట్నంలో మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా వైసిపి కౌన్సిలర్లు కూర్చున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులు మున్సిపల్ కార్మికులపై లాఠీ ఛార్జికి నిరసనగా విజయవాడ సిటీలో మూడు సర్కిళ్ల పరిధిలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య కార్మికుల సమ్మె కొనసాగుతోంది. పైడితల్లమ్మ పండగ నేపథ్యంలో పారిశుధ్యం మెరుగు కోసం సమ్మె విరమించాలని కోరుతూ కార్మిక సంఘం నాయకులతో అధికారులు బుధవారం చర్చలు జరిపారు. కార్మికులతో చర్చించాక నిర్ణయం తెలియ జేస్తామని అధికారులకు నాయకులు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. పశ్చిమగోదావరి జిల్లాలో కాంట్రాక్టు కార్మికులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు కాంట్రాక్టు కార్మికులను అదుపులోకి పట్టణ పోలీస్స్టేషన్కు తరలిస్తుండగా డిఎస్ చెరువు వద్ద వాహనం వెనుక ఉన్న డోరు ఊడిపోవడంతో ఆరుగురు కాంట్రాక్టు కార్మికులు జారి పడిపోయి గాయాలపాలయ్యారు. వారిని అదే వాహనంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో కాంట్రాక్టు కార్మికులు ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకుని పెద్దఎత్తున ఆందోళన చేశారు.