Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎస్పీ మించి పడిపోయిన టోకు ధరలు
న్యూఢిల్లీ: ఖరీఫ్ పంటలకు మెరుగైన ధరలు కల్పించి రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం ఇచ్చినా హామీ ఆచరణకు నోచుకోవడంలేదు. తాజా పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కూడా రాకపోడవడంతో రైతులకు దిక్కుతోచడంలేదు. టోకు మార్కెట్లో తమ ఉత్పత్తులను ఎంఎస్పీల కంటే తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనీ, మద్దతు ధరను పెంచుతున్నామని ప్రకటించిన కేంద్రం, 'పీఎం ఆశా' పేరుతో కొత్త పథకాన్ని కూడా తీసుకొచ్చింది. అయినప్పటికీ రైతులకు నిరాశే మిగులుతున్నది. వరుసగా మూడోసారి 2018లో కూడా పంటల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బీజేపీ అధికారంలో ఉండి.. ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా అనేక రాష్ట్రాల్లో రైతులు సోయాబీన్తో పాటు పప్పుధాన్యాలైన పెసర, మినపలను ఎంఎస్పీల కంటే తక్కువకే అమ్ముతున్నారు.
టోకు(హోల్సేల్) మార్కెట్లో రోజువారి ధరలను నమోదుచేసే ప్రభుత్వ అగ్మార్క్ నెట్వర్క్ పోర్టల్ సమాచారం ప్రకారం... రాజస్థాన్లోని అజ్మీర్లో మంగళవారం క్వింటాల్ పెసర పప్పు రూ.4,220లకు అమ్ముడైంది. అంటే ఈ ఏడాది కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) రూ. 6,975లో 40 శాతం తక్కువ. ఈ ఏడాది మాత్రమే గాక గతేడాది ఎంఎస్పీ( క్వింటాల్కు రూ.5,575) కంటే తక్కువకు పడిపోయాయి. కాగా ఖరీఫ్ పంటలకు ఈ ఏడాది ఉత్పత్తి ధరల అంచానా వ్యయం రూ.4,650ని కూడా లభించలేదు. మధ్యప్రదేశ్లోని మందసోర్ హోల్సేల్ మార్కెట్లో మినప పప్పు ధర క్వింటాల్కు రూ. 3,510లుగా నమోదైంది. ఎంఎస్పీ(క్వింటాల్, రూ. 5,600)లో ఇది దాదాపు 37 శాతం తక్కువ. ప్రస్తుత ధరలు ఉత్పత్తి ధర రూ.3,438 కంటే ఎక్కువ ఉన్నట్టు నామమాత్రంగా కనిపిస్తూన్నా గతేడాది ఎంఎస్పీ రూ.5,400 కంటే తక్కువగా ఉండటం గమనార్హం.