Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నీ రేటెంత?'.. హోం మంత్రి అసభ్యవ్యాఖ్యలు
- మహారాష్ట్రలో పోలీసులకు ఫిర్యాదుచేసిన బాధితురాలు
ముంబయి : సామూహిక లైంగిక దాడికి గురైన ఓ మహిళ... తనకు న్యాయం చేయాలని సాక్షాత్తూ హోంశాఖ సహాయ మంత్రి వద్దకు వెళితే.. బాధితురాలిపైనే మంత్రి దుర్భాషలాడిన ఘటన వెలుగులోకి వచ్చింది. మంత్రి దీపక్ కేసర్కర్పై బాధితురాలు దక్షిణ ముంబయిలోని మరినె డ్రైవ్ పోలీస్టేషన్లో ఫిర్యాదుచేసింది. తనకు న్యాయం చేయాలని కోరేందుకు వెళితే మంత్రి దీపక్ కేసర్కర్ తనతో అసభ్యంగా మాట్లాడారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది మేలో థానే జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతంలో ఏడుగురు వ్యక్తులు ఆమెపై, ఆమె మైనరు కూతురుపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితులు ఏడుగురుకాగా, పోలీసులు ఒకరిపైన మాత్రమే కేసు నమోదుచేశారు. ఈ విషయమై పలువురు అధికారులను కలిసినా న్యాయం జరగకపోవడంతో హోం శాఖ సహాయ మంత్రిని కలిసేందుకు సోమవారం ఆయన కార్యాలయానికి వెళ్ళింది. 'నీ రేటెంత? నీవు ఎక్కువగా మాట్లాడకు' అంటూ హౌంశాఖ సహాయ మంత్రి దీపక్ కేసర్కర్ అసభ్యంగా మాట్లాడారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది.
నానాపాటేకర్పై ఎఫ్ఐఆర్ : సీనియర్ నటుడు నానాపటేకర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన తనుశ్రీదత్తా ఆయనపై గురువారం ఎఫ్ఐర్ నమోదుచేసింది. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె... మహారాష్ట్ర మహిళా కమిషన్ సాయంతో నానా పటేకర్తో సహా మరో ముగ్గురిపై కేసు నమోదుచేసింది. నృత్యం నేర్పించే సాకుతో 2008లో 'హార్న్ ఓకే ప్లీస్' సినిమా సెట్లో అందరిముందూ తనను అసభ్యంగా తాకాడనీ తనూశ్రీ దత్తా ఆరోపిస్తున్నది. నానాపాటేకర్ ప్రవర్తనపై అప్పట్లో తాను సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్, కొరియోగ్రాఫర్లకు ఫిర్యాదుచేశానని చెప్పారు. అయితే, అలాంటి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చిన వారు.. అనంతరం ఓ సన్నివేశంలో ఆయనతో నృత్యం చేయాలని బలవంతం చేశారని ఆరోపించారు.
'నా కొడుకే దోషి అయితే ఉరి తీయండి..'
అహ్మదాబాద్: నా కొడుకే దోషి అయితే వాడిని ఉరి తీయండి.. కానీ మిగితా వలస కార్మికులపై దాడి చేసి వారిని తరిమేయకండని 14 నెలల చిన్నారిపై లైంగికదాడి కేసులో నిందితుడి తల్లి.. గుజరాత్ ప్రజలకు ఉద్వేగపూరితంగా విజ్ఞప్తి చేసింది. గతనెల 28న గుజరాత్లోని సబర్కంఠలో 14 నెలల చిన్నారిపై జరిగిన లైంగికదాడి కేసులో బీహార్నుంచి వలస వచ్చిన ఓ యువకుడు అరెస్టయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్లాంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వలసవచ్చిన కార్మికులపై గుజరాతీయులు దాడి చేసి తరిమేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నేరంలో తన కొడుకే దోషి అయితే అతన్ని ఉరితీయండని, మిగితా అమాయక వలస కార్మికులను వదిలేయండని నిందితుడి తల్లి రమాదేవి కోరారు. బీహార్లో సహరన్ జిల్లాలోని మాంఝీ బ్లాక్కు చెందిన రమాదేవీ మాట్లాడుతూ.. తన కొడుకు మానసిక స్థితి సరిగా లేదని, ఐదో తరగతే కష్టంగా చదవగలిగాడని తెలిపారు. రెండేండ్ల క్రితం ఇంట్లో చెప్పకుండానే మిత్రులతో కలిసి తన కొడుకు గుజరాత్ వెళ్లాడని, కొన్ని నెలల కిందే ఈ విషయం తెలిసిందని చెప్పారు. ముక్కుమీద కోపంతో ఉండే ఈ యువకుడు తనకు నచ్చినట్టు ఉండేవాడని నిందితుడు గుజరాత్కు వెళ్లకముందు పనిలో పెట్టుకున్న వ్యక్తి తెలిపారు. అయితే అతను మైనర్పై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడాన్ని మాత్రం సందేహిస్తున్నారని అన్నారు.