Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన నాయకుడి స్మారక విగ్రహం తొలగించి రామాలయ నిర్మాణం
- పోలీసులకు సీపీఐ(ఎం) ఫిర్యాదు
అగర్తలా : త్రిపురలో వామపక్షవాదులపై అధికార బీజేపీ కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. గిరిజన ప్రాంతంలో ఉన్న ఒక వామపక్ష ఉద్యమ నేత స్మారక విగ్రహాన్ని అక్రమంగా తరలించి, మత రాజకీయాలకు పాల్పడుతోంది. స్మారక విగ్రహాన్ని తొలగించటంపై అధికార పార్టీ బీజేపీ, సనతాన్ సంస్థలపై దక్షిణ త్రిపుర జిల్లా ఎస్పీకి సీపీఐ(ఎం) నాయకులు ఫిర్యాదు చేశారు.
సీపీఐ(ఎం) దక్షిణ త్రిపుర జిల్లా కార్యదర్శి తపస్ దత్తా మాట్లాడుతూ...''గిరిజన హక్కుల కోసం పోరాడిన నాయకుడు 'మోహిని త్రిపుర'. అప్పటి కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. 1967లో ఉద్యమం కోసం తన ప్రాణత్యాగం చేశారు. అలాంటి వ్యక్తి స్మారక విగ్రహాన్ని మాతాయి వద్ద 2017లో ప్రతిష్టించాం. ఈ స్మారక విగ్రహాన్ని మరో చోటకు అక్రమంగా తరలించి, దానిస్థానంలో రామాలయాన్ని కట్టడానికి బీజేపీ, సనతాన్ సంస్థలు పునాది రాయి వేశాయి. త్రిపురలో వామపక్ష ఉద్యమాన్ని చెరిపేయాలన్న ప్రయత్నమిది'' అని అన్నారు.
దీనిపై జిల్లా ఎస్పీ జల్సింగ్ మీనా మాట్లాడుతూ...''గిరిజన ప్రాంతం 'మాతాయి' వద్ద ఏడాది క్రితం సీపీఐ(ఎం) నాయకుడి స్మారక విగ్రహాన్ని ప్రతిష్టించారు. దానిని తొలగించి, నేడు అదే చోట రామాలయం కట్టడానికి బీజేపీ, సనాతన్ సంస్థలు ఈనెల 5న పునాదిరాయి వేశారన్నది ఆరోపణ. సీపీఐ(ఎం) జిల్లా పార్టీ చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాం. ఇంతవరకూ ఎవర్నీ అరెస్టు చేయలేదు'' అని అన్నారు.