Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభాసుపాలైన యూపీ సీఎం, బీహార్ గవర్నర్
లక్నో: నోరెత్తితే భారతీయ సంస్కృతీ, సంప్రదాయాల గురించి గంటల తరబడి మాట్లాడే బీజేపీ నాయకులు.. మరణించిన వ్యక్తికి శ్రద్ధాంజలి ఘటించేటప్పుడు మాత్రం నవ్వులు విరజిమ్ముతూ అభాసుపాలవుతున్నారు. నాలుగు రోజుల క్రితం మరణించిన మాజీ గవర్నర్ ఎన్డి తివారి అంత్యక్రియల్లో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీహార్ గవర్నర్ లాల్జీ ఠాండన్, యూపీ మంత్రులు మొహిసిన్ రజా, అశుతోష్ ఠాండన్లు.. సరదాగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా, వీరి తీరు పట్ల కాంగ్రెస్తో పాటు సమాజ్వాదీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి జిషాన్ హైదర్ మాట్లాడుతూ.. ఈ చర్య ద్వారా బీజేపీ నిజస్వరూపం బయిటపడిందన్నారు. యూపీకి రెండు సార్లు, ఉత్తరాఖండ్కు ఒక పర్యాయం ముఖ్యమంత్రిగా, గవర్నర్గా వ్యవహరించిన వ్యక్తికి బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. వారికి (బీజేపీ) మానవత్వం లేదని, అన్ని సభలను రాజకీయాల కోసమే వాడుకుంటారని ఎస్పీ విమర్శించింది. బీజేపీ నాయకులు గతంలోనూ మాజీ ప్రధాని వాజ్పేయి అంత్యక్రియల్లోనూ నవ్వుతూ అభాసుపాలైన సంగతి తెలిసిందే.