Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నత్తనడకన గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణం
- రెండేండ్లలో ఎంపికైంది 287మంది
- తిరస్కరణకు గురైన దరఖాస్తులు 61,101
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రజలకు గృహ వసతి కల్పించడం కోసం ఎంతో గొప్పగా ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాజ్ యోజన-గ్రామీణ(పీఎంఏవై-జి) పథకం అమలులో మాత్రం ఏమాత్రం ముందుకు సాగలేదని స్పష్టమవుతోంది. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో 61,101మందిని అనర్హులుగా తేల్చినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ వెల్లడించింది. తిరస్కరణకు గురైన 16,392 దరఖాస్తులతో ఉత్తర్ప్రదేశ్ మొదటిస్థానంలో ఉండగా,14,765 దరఖాస్తులతో తెలంగాణ రెండో స్థానంలో, 12,828 దరఖాస్తులతో రాజస్థాన్ మూడో స్థానంలో ఉన్నాయి. కాగా, ఈ పథకం కింద అర్హత పొందిన దరఖాస్తుదారుల సంఖ్య కేవలం 287 మాత్రమే.
ఈ పథకం పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్లే అర్హతలేనివారు అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారని మంత్రిత్వశాఖలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేవారి ఆదాయం ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్య ఉండాలి. తిరస్కరణకు గురైనవాటిలో అత్యధిక దరఖాస్తుదారుల ఆదాయం రూ.6 లక్షలపైనే ఉన్నట్టు ఆ అధికారి తెలిపారు. ఈ పథకంలోని మరో నిబంధన ప్రకారం దరఖాస్తు చేసుకునే జంటకు వివాహితులైన పిల్లలు ఉండకూడదు. అవివాహిత పిల్లలున్న దంపతులు మాత్రమే ఈ పథకం కిందికి వస్తారు. ఈ నిబంధనలన్నిటినీ పరిగణనలోకి తీసుకొని వడపోయగా ఈ పథకం కింద దేశావ్యాప్తంగా అర్హత కలిగినవారి సంఖ్య కేవలం 287 మాత్రమే. ఇది రెండేండ్ల కాలంలో అన్నది గమనార్హం. దీంతో, కేంద్రం ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ పథకంలో ఎన్ని లొసుగులున్నాయో అర్థమవుతోంది.
వడపోతల అనంతరం అర్హత పొందిన లబ్దిదారుల విషయంలో గుజరాత్ 197 మందితో మొదటిస్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రం నుంచి వచ్చిన దరఖాస్తుల్లో 1257 తిరస్కరణకు గురయ్యాయి. అర్హత పొందిన లబ్దిదారుల్లో ఆ తర్వాతి స్థానాల్లో 45మందితో తెలంగాణ, 31మందితో రాజస్థాన్ నిలిచాయి. అస్సాం నుంచి వచ్చిన 1416, బీహార్ నుంచి వచ్చిన 1280 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల నుంచి ఏ ఒక్కరూ ఎంపిక కాకపోవడం గమనార్హం. మధ్యప్రదేశ్ నుంచి 3885, జార్ఖండ్ నుంచి 3622, ఛత్తీస్గఢ్ నుంచి 376, మేఘాలయ నుంచి 199, ఒడిశా నుంచి 315, జమ్మూకాశ్మీర్ నుంచి 104, పంజాబ్ నుంచి 86, హర్యానా నుంచి 50, హిమాచల్ప్రదేశ్ నుంచి 81, త్రిపుర నుంచి 117, కేరళ నుంచి 6 దరఖాస్తులు తిరస్కరణకు గురి కాగా.. ఈ రాష్ట్రాల నుంచి ఏ ఒక్కరూ లబ్దిదారులుగా అర్హత పొందకపోవడం గమనార్హం.