Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్లో థియేటర్ యాజమాన్యాల సమ్మె
- లెవీ పెంపుతో తీవ్ర నష్టం
- ఎన్నికలయ్యే వరకూ బొమ్మ బందే : ఓనర్లు
భోపాల్: మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ చందంగా తయారైంది మధ్యప్రదేశ్లో థియేటర్ యాజమాన్య సంఘాల పరిస్థితి. ఇప్పటికే మోడీ సర్కారు తీసుకొచ్చిన జీఎస్టీ దెబ్బకు పెరిగిన టికెట్ రేట్లతో ప్రేక్షకులెవ్వరూ థియేటర్లకు రాక తలలు పట్టుకుంటుంటే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం (స్థానిక సంస్థలు) ఎంటర్టైన్మెంట్పై విధించే పన్నులను 5 నుంచి 15 శాతానికి పెంచింది. దీంతో, ఈ పన్నుల భారం ప్రత్యక్షంగానే థియేటర్ యాజమాన్యాలపై పడనున్నాయి.
తాజా నిర్ణయం వల్ల సినిమా టికెట్ రేట్లేమి పెరుగకపోయినా ప్రభుత్వానికి తాము కట్టే పన్నులు మరింత భారంగా మారుతాయని థియేటర్ ఓనర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 6 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. పదిహేడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఏ విధమైనా స్పందన లేదు. దీంతో, పెంచిన పన్నులను తగ్గించేవరకూ థియేటర్లను తెరిచేది లేదని కరాఖండిగా చెబుతున్నారు. సమ్మె కారణంగా వీరికి దాదాపు రూ. 50 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నా.. సమ్మెను విరమించేదిలేదని స్పష్టం చేస్తున్నారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో థియేటర్ల సమ్మె వల్ల చిత్ర పరిశ్రమకూ తీవ్ర నష్టం వాటిల్లనుంది.
మధ్యప్రదేశ్లో దాదాపుగా 450 థియేటర్లుండగా.. వీటిలో భోపాల్, ఇండోర్, గ్వాలియర్ వంటి నగరాల్లో ఉన్న మల్లీప్లెక్స్్లు మినహా చాలా చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లే అధికం. సర్కారు నిర్ణయంతో ఇవన్నీ తీవ్రంగా నష్టపోనున్నాయి. జీఎస్టీలో భాగంగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కింద థియేటర్లలో ఇప్పటికే రూ. 200 కంటే ఎక్కువగా ఉండే టికెట్ రేట్లపై 28 శాతం జీఎస్టీని విధిస్తున్నారు. తాజా పన్నులతో.. వాటిపై జీఎస్టీతో పాటు మరో 15 శాతం లెవీని (మొత్తంగా 43 శాతం) వేయనున్నారు. అలాగే వంద రూపాయల నుంచి రూ. 200 మధ్య ఉండే టికెట్లపై 10 శాతం, వంద రూపాయల కంటే తక్కువగా ఉండే వాటిపై 5 శాతం లెవీని విధించాలని సర్కారు నిర్ణయించింది.
జీఎస్టీయే గాక భోపాల్, ఇండోర్ వంటి నగరాలలో మల్టీప్లెక్స్లలో ఒక్కో ఆటకు రూ. 200, సింగిల్ స్క్రీన్లలో రూ. 50 లను అదనంగా ప్రభుత్వానికి పన్నుల రూపేణా సమర్పించుకోవాల్సిందే. ఇక తాజాగా విధించే లెవీతో థియేటర్లకు మరింత భారం కానున్నది.
అసలు థియేటర్లలో సినిమాలు చూడటానికే ప్రజలు ఆసక్తి చూపకపోవడం, పైరసీ విపరీతంగా పెరిగిపోవడం వల్ల నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని చాలా థియేటర్లు మూత పడుతున్నాయి. మరికొన్నింటిని ఫంక్షన్ హాల్లకు, రోజూవారీ కార్యక్రమాలకు అద్దెకిస్తున్నారు. ఇక, ఇప్పుడు విధించే పన్నుల కారణంగా తాము థియేటర్లను మూసుకోవాల్సిందేనని సెంట్రల్ సర్క్యూట్ అసోసియేషన్ (సీసీసీఎ) అధ్యక్షుడు బసంత్ లోధా తెలిపారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత ఇతర పన్నులేమి ఉండవని.. దేశమంతటికీ ఒకే పన్ను విధానమని ప్రకటించిన మోడీ సర్కారు ప్రకటించారు. కానీ, తాజా నిర్ణయంతో మద్యప్రదేశ్ సర్కారు మరోసారి ధ్వంధ్వ పన్నుల విధానాన్ని అవలంభిస్తోందని లోధా ఆరోపించారు. ఇదే విధానం కొనసాగితే థియేటర్లన్నీ మూత పడాల్సిందేనని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు నిర్ణయం పట్ల మద్యప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన యాజమాన్య సంఘాలు.. రాష్ట్రంలో ఎన్నికలు అయ్యేవరకూ సమ్మెను విరమించబోమని తేల్చి చెబుతున్నాయి.