Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జన్ ఏక్తా జన్ అధికార్ ఆందోళన్ కన్వీనర్ హన్నన్ మొల్లా
నవతెలంగాణ-ఢిల్లీ బ్యూరో
రాఫెల్ కుంభకోణాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ చేపట్టాలని జన్ఏక్తా జన్ అధికార్ ఆందోళన్ కన్వీనర్, సీపీఐ(ఎం), మాజీ ఎంపీ హన్నన్ మొల్లా డిమాండ్ చేశారు. డస్సాల్ట్తో రక్షణ శాఖ చేసుకున్న ఒప్పందంలో ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నందున, లోతైన విచారణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. జేపీసీ మాత్రమే అన్ని అంశాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. 100 వామపక్ష ప్రజా సంంఘాలు సంయుక్తంగా వారం రోజుల పాటు ఆందోళన నిర్శహించనున్నట్టు సోమవారం ఆయన మీడియాకు తెలిపారు. సోమవారం నుంచి 28వరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రధాన కూడలి, ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనకార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. రాఫెల్ కుంభకోణంలో మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వక ఉల్లంఘనలకు పాల్పడిందని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా డస్సాల్ట్ రాఫెల్ ఫైటర్ జెట్ విమానాలను అనిల్ అంబానీ కంపెనీకి అప్పజెప్పిందని ఆరోపించారు. రక్షణ రంగంలో రాఫెల్ స్కాంను అతి కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ దేశ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జాతీయవాదం పేరుతో దేశంలో ఆర్థిక దోపిడీకి బీజేపీ పాల్పడుతున్నదని అన్నారు. భారతీయ జనతాపార్టీ దేశ భద్రత విషయంలో రాజీ పడిందని విమర్శించారు. రాఫెల్ ఒప్పందంతో సుమారు రూ.41,260 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని వివరించారు. విమానాల తయారీలో ప్రభుత్వరంగ సంస్థ అయిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్)ను పక్కన పెట్టి అనల్ అంబానీ కంపెనీతో ఒప్పందం చేయిండంలో బీజేపీ ఏస్థాయిలో అశ్రిత పెట్టుబడిదారీ విధానాలను అవలంభిస్తుందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కుంభకోణంపై ప్రభుత్వం స్పందించే వరకు తాము గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేపడుతామని హెచ్చరించారు. తమ సంఘం ఆధ్వర్యంలో ఇదివరకే సెమినార్లు, సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. వారం రోజుల పాటు ఆందోళనలు పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు వివరించారు. ఆయన వెంట జేఈజేఏఏ సభ్యులు కవిత, రాహుల్ గుప్తా తదితరులు ఉన్నారు.