Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండానే కాంగ్రెస్ బరిలోకి దిగుతుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీమంత్రి పి చిదంబరం అన్నారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని.. ఎన్డీయే సర్కారును గద్దె దించడమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్గాంధీని కానీ, మరే ఇతర నేతలను కానీ ప్రధాని అభ్యర్థిగా ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి గెలిచిన తర్వాత ప్రధాని ఎవరనే దానిపై ఆలోచిస్తామన్నారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ సమావేశమై ప్రధాని ఎన్నికపై తుది నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. మోడీ సర్కారుకు చెక్ పెట్టేందుకు బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే దిశగా కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలు కొంతకాలంగా పుంజుకుంటున్నాయని తెలిపారు. కాగా.. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో చేతులు కలపకుండా కేంద్రంలోని బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీయేతర పార్టీల మద్దతు కూడదీసుకునేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తుండగా.. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది.